ఏపీ రాజకీయాల్లో గవర్నర్ నరసింహన్ వేలు పెట్టారా.. కేంద్రంలోని మోడీ సర్కారుకు చంద్రబాబు సర్కారుకు మధ్య ఆయన పుల్లలు పెట్టారా.. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నివేదికలు పంపారా.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ఎంపీ రాధాకృష్ణ. రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్ పైనే నేరుగా విమర్శలు చేస్తూ సంపాదకీయం రాయడం కలకలం సృష్టిస్తోంది.
ఆయన సంపాదకీయం ప్రకారం.. మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం– భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి గవర్నర్ కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారట. హైదరాబాద్ వచ్చి తనను కలిసే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులందరి వద్ద చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారట.
అంతే కాదు.. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరి వద్ద కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గవర్నర్ చిట్టా విప్పారట. గవర్నర్ వైఖరికి సదరు ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారట. చివరకు.. ఇది ఎంత దూరం వెళ్లిందంటే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు గవర్నర్ నరసింహన్ ఇందులో ఏదో మతలబు ఉందని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారట.
గవర్నర్ నరసింహన్ చెబుతున్న మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దురభిప్రాయం ఏర్పరచుకున్నట్లు ఏబీఎన్ రాధాకృష్ణ అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుకు ఆయన చాలా రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తేల్చి చెబుతున్నారు. అంతేనా... ఏపీలో పరిస్థితులు జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్ కల్యాణ్ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్ నివేదిక ఇచ్చారట! పవన్ కల్యాణ్, ఐ.వై.ఆర్.కృష్ణారావు వంటివారితో కూడా సంప్రదింపులు జరిపారట! మరి ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో..!?