కన్నడ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారా ? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన బీజేపీకి బుద్ధి చెప్పడానికి, అదే సమయంలో ఏపీ ప్రజల మెప్పు పొందడానికి ఆయన సరికొత్త వ్యూహం పన్నుతున్నారా..? ప్రత్యేక హోదా ఉద్యమంలో దూసుకుపోతున్న వైసీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ను అధిగమించడానికి ఆయన ఏం చేయబోతున్నారు.? ఈ ప్రశ్నలు సచివాలయంలో చంద్రబాబు అఖిలపక్ష సమావేశం అనంతరం తలెత్తుతున్నాయి.
అఖిల పక్ష సమావేశంలో పలు పార్టీలు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి ఆసక్తికరమైన సలహాలు, సూచనలు చంద్రబాబుకు అందాయని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలంటే కన్నడలో ఆ పార్టీని ఓడించడానికి చంద్రబాబు ప్రచారం చేయాలని, ఢిల్లీలో ధర్నా, నిరాహార దీక్ష చేయాలని పలువురు సూచించారు. ఈ సందర్భంగా బాబుగారు స్పందిస్తూ ఈ అంశాలన్నింటిపై సమన్వయ కమిటీ, కార్యనిర్వాహక కమిటీల్లో చర్చించి నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణుల్ని కన్నడకు పంపించి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పలువురు చంద్రబాబు కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరడం కలకలం రేపుతోంది. అయితే వారు యాదృచ్చికంగా చెప్పారా.. బాబుగారి వ్యూహంలో భాగంగా చెప్పారా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
అయితే కన్నడలో ఏపీ సరిహద్దు జిల్లాలు అయిన బళ్లారి, కోల్లార్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజల ఓట్ల సంఖ్య గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. అక్కడి తెలుగు ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ఓడించాలని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.