పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ₹ 13500 కోట్ల మేర ధారుణంగా నిండా ముంచి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి చెక్కేసిన నీవర్ మోదీ అరెస్టు దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం నీరవ్ మోదీ హాంకాంగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు, పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు.
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం చైనా ప్రత్యేక పాలనా ప్రాంతం హాంకాంగ్లో తలదాచుకుంటున్నట్టు భారత్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్టు చేయాలంటూ భారత్ నుంచి వచ్చిన ప్రతిపాదనపై హాంకాంగ్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చునంటూ చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయం భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ, నీరవ్ మోదీ ని అరెస్టు చేయాల్సిందిగా చైనాలోని "ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంగ్ కాంగ్-హెచ్కేఎస్ఏఆర్" ను కోరినట్టు వెల్లడించారు. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీ ని ప్రొవిజనల్ అరెస్ట్ (తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీని కోరినట్టు భారత ప్రభుత్వం పేర్కొంది.
2018మార్చి 23నే ఈ అభ్యర్థనను హాంకాంగ్ అథారిటీకి సమర్పించామని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. అయితే ఆదివారమే నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ముంబై సీబీఐ స్పెషల్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. నీరవ్తో పాటు మెహుల్ చౌక్సిపై కోర్టు నాన్-బెయిల బుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
జనవరిలో ఈ కుంభకోణం బయటికి రాకముందే, వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. తొలుత స్విట్జర్లాండ్కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్, ఆ అనంతరం హాంకాంగ్ లో ఉన్నట్టు తెలిసింది. దేశం విడిచి పారిపోయిన వీరిద్దరిన్నీ భారత్కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత ప్రతిపాదనపై స్పందించాలంటూ వచ్చిన ప్రశ్నపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ, "కేంద్ర ప్రభుత్వ అధికారం, సహకారం మేరకు, ఒక దేశం రెండు వ్యవస్థల నిబంధనలు, హాంకాంగ్ చట్టాలను అనుసరించి న్యాయ ప్రక్రియలో ఇతర దేశాలకు హాంకాంగ్ సహకరించవచ్చు" అని పేర్కొన్నారు. హాంకాంగ్కు భారత్ సహేతుకమైన ప్రతిపాదన చేస్తే, ఆయా అంశాల్లో హాంకాంగ్ తన చట్టాలను అనుసరించి ముందుకెళ్లవచ్చునని అన్నారు.
నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాలంటూ హాంకాంగ్కు భారత్ ప్రతిపాదించడం, అందుకు చైనా నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలూ లేకపోవడంతో నీరవ్ మోదీ అరెస్టు ఖాయమైనట్టేనని చెబుతున్నారు. ఇప్పటికే హంకాంగ్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే హాంకాంగ్ ప్రభుత్వం ఆయన అరెస్టుపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. నీరవ్ మోదీ, అతడి మేనమామ మెహుల్ చోక్సీలపై సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన మరుసటి రోజే ఆయన అరెస్టుకు చర్యలు వేగవంతం కావడం గమనార్హం.