కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు... ఏ పార్టీకి మద్దతు ఇస్తారు..? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన బీజేపీని ఉతికేస్తారా..? తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మాటల్ని నమ్ముతున్నారా..? ఏపీని మోసం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్న టీడీపీ నేతలు మరి ఎవరికి ఓటేయమని చెబుతున్నారు? చివరకు తటస్థంగా ఉన్న జేడీఎస్ వెంట నడుస్తారా..? ఇప్పుడీ ప్రశ్నలు అందరిలో ఉత్పన్నం అవుతున్నాయి. కన్నడ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కర్ణాటకలోని బళ్లారి, కోలార్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు ఏపీలో జరుగుతునన రాజకీయ పరిణామాలను కూడా సునిశితంగా గమనిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమ ప్రభావం సరిహద్దు ప్రాంతాలపై కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని అక్కడి తెలుగు ప్రజలు గమనిస్తున్నారనీ, ఇచ్చిన మాటను నెరవేర్చని మోడీకి బుద్ధి చెప్పాలని టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు. అయితే కన్నడలోని తెలుగు ప్రజలు మాత్రం అటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని పక్కనబెట్టి తటస్థంగా ఉన్న జేడీఎస్కే జై కొడుతారనే టాక్ వినిపిస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ మోసం చేశాడనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇదే వాదన బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో కన్నడ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపున చిరంజీవి ప్రచారం చేస్తారని అక్కడి కేపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. జేడీఎస్ తరుపున ఆయన ప్రచారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పవన్గనుక ప్రచారం చేస్తే ఏపీకి కాంగ్రెస్, బీజేపీ ఎలా అన్యాయం చేశాయో చెప్పే అవకాశం ఉందనీ, ఆ ప్రభావంతో తెలుగు ప్రజలు జేడీఎస్కే జై కొడుతారని పలువురు నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ నాటికి నెలకొన్న రాజకీయ పరిణామాలే ఎవరికి ఓటు వేయాలో తెలుగు ప్రజలకు చెబుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.