అనుభవం అయితేగాని తత్త్వం బోధపడదు అన్న చందంగా మారిపోయింది ఫిరాయింపు నేతల పరిస్థితి. అటు సొంత గూటిని వదిలి ఎన్నో ఆశలతో అధికార పార్టీలో చేరిన వీరికి చివరికి నిరాశే ఎదురవుతోంది. కొత్త పార్టీలో ఇమడలేక కొందరు ఇప్పటికీ సతమతమవుతూ ఉన్నారు. అసలే ఎన్నికల సమయం కావడంతో టికెట్ దక్కుతుందనే హామీ అధికార పార్టీ నేతల నుంచి రాకపోవడంతో.. ఫిరాయింపు నేతలు ఇప్పుడు సొంత గూటికి ఎప్పుడు ఎగిరిపోదామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారట. కొందరు నేతలు ఇప్పటికీ సొంత పార్టీలోని నేతలతో టచ్లో ఉంటున్నారట. ఇది తెలిసిన అధికార పార్టీ నాయకులు రాయబారాలకు దిగుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తిరిగి కారుదిగిపోయే ఆలోచనలో ఉన్నారట. ఆయన్ను బుజ్జగించేందుకు నేతలను రంగంలోకి దించినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. ఆయన సొంతగూటికి రేపో మాపో ఎగిరిపోవచ్చని స్పష్టమవుతోంది.
ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో ఫిరాయింపు నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఎన్నో హామీలతో అధికార పార్టీ కండువా కప్పేసుకున్న వీళ్లు.. పార్టీలో ఇమడలేకపోతున్నారట. అంతేగాక సిట్టింగ్లకే ఈసారి కూడా టికెట్లు ఇస్తామని చెప్పడంతో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. టికెట్ ఇస్తే గెలవడం కష్టమని తేలిన వారి స్థానాల్లోనే కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోటీ చేసేందుకు తహతహలాడుతున్న నాయకులు.. ఇప్పటినుంచే తమకు టికెట్ ఇస్తారా లేదా అన్నదానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయి అధికార పార్టీలో చేరిన వారిలో కొంతమంది ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేరు కూడా వినిపిస్తోంది.
ఆయన కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగారు. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడటంతో ఆయన అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో బస్వరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టికెట్ కొండా సురేఖకే వచ్చే సూచనలు కనిపించడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర కు, ప్రజల నుంచి విశేషంగా మద్దతు లభించడంతో, రెండు రోజుల క్రితమే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బస్వరాజ్ సారయ్య కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఆగమేఘాల మీద బస్వరాజు సారయ్య ఇంటికి వెళ్లి, ఆయనతో సంప్రదింపులు జరపడంతో కార్యకర్తల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సారయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాక, పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని, కనీసం పార్టీ వ్యక్తిగా గుర్తించడం లేదన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో సారయ్య పార్టీ మారతారన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఇక నన్నపనేని నరేందర్ ను కావాలనే రాయబారాలకు పంపారని, ఎవరెన్ని మంతనాలు జరిపినా బస్వరాజు సారయ్య పార్టీ మారడం పక్కా అంటున్నారు జిల్లా నేతలు.