నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణం తెలంగాణ మొత్తంగా ప్రభావం చూపుతోంది. నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త హత్య, ఈ విషయంలో ప్రధానంగా మంత్రి జగదీశ్రెడ్డిపై, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంపై ఆరోపణలు రావడం.. అసెంబ్లీ సమావేశాల జరిగిన ఘటనల నేపథ్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శాసన సభ్యత్వం రద్దు చేయడం.. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో జిల్లాలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జిల్లాలో జరిగిన ఈ వరుస ఘటనలు వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలూ ఉన్నాయి.
ప్రధానంగా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తను మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే వీరేశంతో కలిసి హత్య చేయించాడని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. తన దగ్గర తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. తన శాసన సభ సభ్యత్వం రద్దు తర్వాత కోమటిరెడ్డి మరింతగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జగదీశ్ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించేందుకు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు.
తాజాగా మంత్రి జగదీశ్రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ఆరోపణలు సూర్యాపేటలో దూమారం రేపుతున్నాయి. నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయంశం అవుతున్నాయి. సూర్యాపేట కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో గాకుండా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నిర్మించడంపై కోమటిరెడ్డి మండిపడుతున్నారు.
వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నాప్రైవేట్ భూముల్లో కలెక్టరేట్ నిర్మించడంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెబుతున్నారు. కలెక్టరేట్ నిర్మాణంలో మంత్రి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడాడ్డని ఆరోపిస్తున్నారు. ముందుగా బీనామీల పేరుతో ప్రైవేట్ భూముల్ని కొనుగోలు చేసి, వాటిల్లో కలెక్టరేట్ నిర్మిస్తున్నారనీ, దీనిపై కోర్టుకు వెళ్తామని కోమటిరెడ్డి ప్రకటించడంపై హాట్హాట్గా చర్చ జరుగుతోంది.