వై.ఎస్. జగన్ పాదయాత్ర రాజధానికి చేరుకుంది. ప్రజల స్పందన ఆ పార్టీ నేతలకు అంతులేని ఉత్సాహాన్నిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ జోరుతో టీడీపీ నేతల్లో కలవరం కనిపిస్తోంది. అందుకే జగన్ రాజధానిలో అడుగుపెట్టగానే ఒక్కసారిగా విమర్శల జోరు పెంచేశారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకూ వీలైనంతవరకూ వైసీపీని టార్గెట్ చేస్తూ అడుగులు ముందుకేస్తున్నారు.
ముందుగా.. మంత్రి జవహర్ తీవ్ర పదజాలంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే సమయంలో ప్రతిపక్షనేత జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చేశారు. మతిభ్రమించిన వ్యక్తిలా ప్రతిపక్షనేత విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు.
సంస్కార హీనంగా జగన్ భాష ఉందన్న జవహర్ ఇలాంటి భాష భవిష్యత్తు తరాలను కలుషితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ మెప్పు పొందేందుకే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు.. ప్రజల సంకల్పానికి వ్యతిరేకంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని, పట్టిసీమతోపాటు అన్ని అభివృద్ధి పనులనూ వ్యతిరేకిస్తున్న జగన్ అసలు మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాజధాని నిర్మాణానికి, పట్టిసీమకు జగన్ వ్యతిరేకమా... అనుకూలమా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని శంకుస్థాపనకే రాని జగన్ కు.. రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని కంభంపాటి ధ్వజమెత్తారు. అటు మురళీ మోహన్ కూడా జగన్ పై తుపాకీ ఎక్కుపెట్టారు. బీజేపీ, అన్నాడీఎంకేలతో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. అమిత్ షా సూచనలతోనే మోడీ నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగకపోవటానికి ప్రధానమంత్రి మోదీయే కారణమని ఎంపీ మురళీమోహన్ విమర్శించారు. మొత్తానికి జగన్ రాజధాని టూర్ టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.