జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన ఘోరం మన ఇండియాలోని ప్రతివారినీ సిగ్గుతో తల దించుకునేలా చేసింది. ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా ఈ విషయం పైనే చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలో స్త్రీలను రక్షించడానికి బలమైన చట్టాలు ఉన్నా స్త్రీల పై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచార సంఘటనలు నిరోధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి.
ఇప్పుడు ఈ విషయాల పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలక పక్షాలు కానీ ప్రతి పక్షాలు కానీ ఈ సంఘటన పై స్పందించక పోయినా ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ స్పందించడం ‘జనసేన’ పార్టీ అభిమానులకు ఆనందాన్ని కలగచేసింది. అయితే ఈవిషయంలో పవన్ స్పందించిన తీరులో పరిణితి లోపించిందా అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిని బహిరంగంగా తోలుతీయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశాడు. దీనితో పవన్ స్పీచ్ లోని ఆవేశం అప్పటికప్పుడు చప్పట్లు కొట్టించుకోవడానికి సరిపోతుంది కానీ ఇలాంటి అకృత్యాలు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి జీవితంలో అత్యాచారాలు చేయకుండా శిక్షలు విధించాలి అని ఆవేశంగా మాట్లాడేవారితో సమానంగా మాట్లాడిన పవన్ మాటలలో ఫైర్ కనిపిస్తోంది.
అయితే ఇలాంటి సమస్యల మాటలలోకి వెళ్లి ఈ సమస్యలకు పరిష్కారాలు వెతకాలి అని మేధావులు చేస్తున్న సూచనలు పవన్ దృష్టికి రాలేదా అంటూ మరికొందరు పవన్ ఆలోచనా సరళి పై కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఉపన్యాసంలో వివిధ సమస్యల పై ఆవేసపూరితంగా చెపుతున్న డైలాగులు ఒక సినిమాలోని హీరో పాత్రకు సరిపోతాయి కానీ ఒక రాజకీయ పార్టీ నేతగా ఏ కీలక సమస్యకు సరైన పరిష్కారాలు చూపించే స్థాయిలో లేవు అంటూ విమర్శకులు పవన్ ఉపన్యాసాల పై మాటల దాడి చేస్తున్నారు..