కర్ణాటక ఎన్నికలు మరో ఇరవై రోజులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా దేశవ్యాప్తంగాతమ హవా ఏమాత్రమూ తగ్గలేదని నిరూపించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిపతి అమిత్ షా కాలికి బలపం కట్టుకుని మరీ కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచారం ఉద్రుతంగానే చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు కూడా. సిద్దరామయ్య ప్రభుత్వం 10% కమీషన్ ప్రభుత్వం అంటూ విమ ర్శలు గుప్పించారు. ఇక, మాజీ సీఎం యడ్యూరప్పనే కాబోయే సీఎం అంటూ పరిచయం చేసి ప్రకటించారు కూడా. అయి తే, ఏపీ సహా, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో తెలుగువారు, తమిళప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసేలా ఏపీ, తమిళనాడుకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, కన్నడ ప్రజల మనోభావం మాత్రం బీజేపీకి అనుకూలం గా ఉండడం తాజాగా వెల్లడైన ఓ సర్వేలో తెలిసింది. బీజేపీ ప్రభుత్వం వల్లే కర్ణాటక రైతులు కావేరీ జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని, గతంలో కాంగ్రెస్ నతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై ఎలాంటి ముందడుగు వేయలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి అనుకూలంగా ఇక్కడి ప్రజలు మాట్లాడుతున్నారు. అయితే, తమిళనాడులో పెరుగుతున్న కావేరీ జలాల వివాదం, కావేరీ బోర్డు ఏర్పాటు వంటి విషయాల్లో.. బీజేపీ ప్రభుత్వం మెతక వైఖరి అనుసరిస్తుందేమోననే వారూ ఉండడం గమనార్హం.
ఇక, బీజేపీ మాత్రం కర్ణాటకపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇక్కడి ఒక్కలిగుల వర్గం తమకు అండగా నిలబడుతుందని కూడా భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎస్ ఎం కృష్ణ ఒక్కలిగుల వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పక్షాన అందరూ బీజేపీని గెలిపిస్తారని పార్టీభారీ ఆశలే పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆయన కుమార్తెకు సైతం టికెట్ కేటాయించింది. ఇక, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప వర్గం కూడా బీజేపీకే జై కొట్టే ఛాన్స్ ఉంది.
సిద్దరామయ్య లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. తీర్మానం చేసినా.. కేంద్రం దానికి పచ్చజెండా ఊపాల్సిన నేపథ్యంలో సిద్దు ప్రయత్నాలు సక్సెస్ అయ్యేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్ధించాలనే ప్రచారం దిగువ స్థాయి నేతల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నడ ప్రజలు బీజేపీకే జైకొడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే, కాంగ్రెస్ కూడా ఇదే తీరుగా దూసుకు పోతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.