తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అనారోగ్యం వల్లే ఆమె చనిపోయిందని తెలిసినా.. ఆమె చివరి రోజులకు సంబంధించిన ఏ అంశాన్నీ బయటకు రానీయకుండా నేతలు గుంభనంగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరి రోజుల్లో జయలలిత దగ్గర నిచ్చెలి శశికళ మాత్రమే ఉన్నారు. ఎవరినీ ఆసుపత్రిలోపలికి అనుమతించలేదు. పూర్తిగా తమ ఆధీనంలోనే ఆ వార్డ్ ను ఉంచుకున్నారు. అన్నాడీఎంకేలోని కీలక నేతలను కూడా జయలలిత దగ్గరకి పంపకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ముఖ్యమంత్రి పళని స్వామి జయలలిత ఆరోగ్యానికి సంబంధించి మరో సంచలన విషయం చెప్పారు.
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించి మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన రావు తప్పుడు సమాచారమిచ్చారని ముఖ్యమంత్రి పళని స్వామి వివరించారు. మరొకరిని కాపాడేందుకే రామ్మోహన్ ఇలా వ్యవహరించారని కూడా ఓపీఎస్ వెల్లడించారు. అయితే ఎవరిని కాపాడేందుకు మాజీ చీఫ్ సెక్రటరీ ఇలా వ్యవహరించారనేదానికి సంబంధించి పళని స్వామి నోరు విప్పలేదు. ఇప్పటికే జయలలిత మరణానికి సంబంధించి పలు అనుమానాలున్నాయి. విచారణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పళని స్వామి తాజా వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
శశికళను కాపాడేందుకే రామ్మోహన్ రావు ఇలా వ్యవహరించి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ అన్నీ తానై వ్యవహరించారు. మంత్రులు, అధికారులు కూడా ఆమె చెప్పినట్టే నడుచుకునేవారు. అందుకే నాడు రామ్మోహన్ రావు కూడా శశికళ చెప్పినట్లు నడుచుకుని ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. అదే నిజమైతే రామ్మోహన్ రావుకు చిక్కులు తప్పకపోవచ్చు. శశికళ – పళని స్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి..