ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా రాజ్యమేలుతుందని అన్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి పార్టీ నుండి వైసీపీ పార్టీ లోకి రావడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షసుడు పాలన జరుగుతుంది. ఈ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి వైసిపి అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తూ మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తున్నారు. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి.అంతే కాకుండా ప్రత్యేక హోదా కూడా వస్తుందని హామీ ఇచ్చారు.
అసలు ప్రత్యేక హోదా కోసం ఇన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఎవరికీ లేదు….కానీ దౌర్భాగ్యుడు అయిన చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు ప్రతి రంగంలో వున్న సామాన్యుడు రోడ్డు మీద పడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని కేంద్రాన్ని అడగాల్సి వస్తుంది అని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
పార్లమెంటులో ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అన్యాయం చేసిందని అన్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకుండా కేంద్రానికి మద్దతు తెలిపి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రానికి సహకరించరు అని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.