ప్రజాధన దుర్వినియోగములో తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం తారస్థాయికి చేరింది. తాత్కాలిక రాజధాని కూడా నిర్మిస్తారనే విధంగా సెటైర్లు పేలిపోతున్నాయి. వందల కోట్ల ప్రజలు కట్టిన పన్నులనే కాదు అప్పులు తెచ్చి రాష్ట్రప్రజల తలసరి ఋణభారం పెంచుతున్న ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రద్రశ్ ప్రజల నెత్తిన తలకు మించిన భారాన్నే మోపనుంది. నిధుల వినియోగమే దుర్గ్రాహ్యంగా ఉంటే అంతకు మించి ప్రజా ధనాన్ని గుటకాయస్వాహా చేసే మంత్రులు రకరకాల మాఫియాల పేరుతో నిరంతర లూటీ రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్నట్లు పలువురు చెపుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ తో పాటు పలువురు మంత్రులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసు కుందని త్వరలో వారిపై సిబిఐ దాడులు జరుగనున్నాయనే వార్తలు తెలుగుదేశం పార్టీనినే కాదు రాష్ట్రంలో వారి అనుయాయులందరిని కుదిపేస్తున్నాయి. ఎందుకంటే, గురువారం ఉదయం ఎంపిలు, కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినపుడు అవే అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. "మనపై కేంద్రం కక్షసాధింపులకు దిగవచ్చు" అని అందరిని అప్రమత్తం చేశారట. కక్ష సాధింపుల్లో భాగంగా తన పైన, లోకేష్ తో పాటు మంత్రులపైన కూడా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు చంద్ర బాబు నాయుడు చెప్పారట. చంద్రబాబు నాయుడే స్వయంగా సిబిఐ విచారణ అంటూ చెప్పటంతో మొత్తం అందరిలోనూ ఆందోళన మొదలైంది.
ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసినప్పటి నుండి ఇదే విషయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ మారుతున్న రాజకీయపరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నట్లే కనబడుతోంది. గడచిన మూడురోజులుగా టిడిపి నేతల మధ్య కూడా అదే చర్చలు జరుగుతున్నాయి మూడున్నరేళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడపుడు బిజెపి నేతలు విమర్శిస్తునే ఉన్నారు. ఎప్పుడైతే టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిందో అప్పటి నుండే చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
అవినీతి గురించి ఆరోపణలు చేయటమే కాకుండా 'సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి' విచారణకు సిద్దపడాలంటూ శాసనసభలోనే సవాలు విసురుతున్నారు. అవినీతి జరిగింది అనేందుకు పోలవరం, పట్టిసీమ ప్రోజెక్టులను, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కూడా ప్రస్తావిస్తున్నారు. అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టినట్లు కూడా ఆరోపిస్తున్నారు. బిజెపి నేతల ఆరోపణలు దాడి పెరుగుతుండటంతో తెలుగుదేశం పరివారంలో నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలీదుకానీ "త్వరలో సిబిఐ దాడులు" అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్ర రాజకీయాలను కట్టి కుదిపేస్తోంది.