ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం బీజేపీపై భగ్గుమంటోంది. ప్రత్యేక హోదా ఇస్తామని, తర్వాత దాన్ని ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నాలుగేళ్లు నాన్చుతూ వచ్చిన బీజేపీ అధిష్టానం తీరును నిరసిస్తూ టీడీపీ కూడా ఆ పార్టీతో పొత్తుకు గుడ్ బై చెప్పేసింది. అయినా బీజేపీ లెక్కచేయలేదు. దీంతో ఆ పార్టీ అహంకారం బయటపడింది. ఓ వైపు బీజేపీని దోషిగా భావిస్తూ అన్ని రాజకీయ పార్టీలూ ఉద్యమిస్తున్న తరుణంలో బీజేపీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.
ఎన్డీయే నుంచి బయటికి వచ్చినప్పుడు చంద్రబాబు అమిత్ షాకు ఈ విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మోదీకి ఆ విషయం చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు వాళ్లద్దరితో మాట్లాడిన సందర్భంలో వారి నుంచి ఆశించినంత స్పందన రాలేదు. పోతే పోనీలే అన్నట్టు వ్యవహరించారు. తొందరపడొద్దు.. అనే మాట తప్ప నిర్దిష్టంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో బాబు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయటికొచ్చేశారు.
చంద్రబాబు బయటికొచ్చేసిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. రెండ్రోజులపాటు చంద్రబాబు ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మకాం వేసి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. చంద్రబాబు జోరు ఈ స్థాయిలో ఉంటుందని ఊహించని బీజేపీ.. నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా ఆపేయించింది. అంతేకాక.. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా స్వరం పెంచాయి.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక శక్తులన్నీ కావడం, కర్నాటకలో బీజేపీ ఓడిపోతుందనే టాక్ వినిపిస్తుండడం, అత్యాచారాలు, నగదు లభ్యత లేకపోవడం.. లాంటి అనేక సమస్యలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షుడిని మార్చాలనుకున్న బీజేపీ.. హరిబాబును రాజీనామా చేయాలని కోరింది. అధిష్టానం దేశాల మేరకు హరిబాబు రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.
హరిబాబు రాజీనామా వ్యవహారంపై మాట్లాడిన అమిత్ షా.. చంద్రబాబుతో తమకు గొడవలేం లేవంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి వ్యతిరేకంగా తొలిసారి స్వరం వినిపించి.. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చన చంద్రబాబుతో గొడవలేం లేవనడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఓ అంచనా. వచ్చే ఎన్నికల అనంతరం మళ్లీ చంద్రబాబుతో అవసరం పడొచ్చనే భావనతోనే ఆయనపై సూటిపోటి విమర్శలు చేయకుండా బీజేపీ అధిష్టానం జాగ్రత్త పడుతోంది. రాష్ట్రంలోని ఒకరిద్దరు బీజేపీ నేతలు మినహా కేంద్రంలోని పెద్దలెవరూ చంద్రబాబును ఎవరూ విమర్శించట్లేదు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మళ్లీ చంద్రబాబుతో స్నేహం చేయాల్సి వస్తే అందుకు బీజేపీ ఏమాత్రం వెనకాడబోదని కేంద్రంలోని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. అప్పుడు చంద్రబాబు డిమాండ్లను నెరవేర్చి.. కేంద్రంలో టీడీపీ మద్దతు తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే.. చంద్రబాబుతో సర్దుకుపోయే నేతనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించవచ్చని సమాచారం.