మౌని బాబా.. ఇది ఒకప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై సెటైర్లు వేస్తూ బీజేపీ నాయకులు పెట్టుకున్న ముద్దుపేరు.. ఇప్పుడు అదే పేరు నరేంద్రమోడీకి వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇప్పుడు మోడీ నోరు విప్పడం లేదు మరి. బ్యాంకు కుంభకోణాలు, అత్యాచారాలు ఎన్ని ఉన్నా.. ప్రధాని మాత్రం సమాధానం చెప్పడం లేదు.
అలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. లండన్ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత వెస్ట్మినిస్టర్ సెంట్రల్ హాల్లో ప్రవాస భారతీయుల సమక్షంలో నిర్వహించిన"భారత్ కీ బాత్..సబ్ కే సాత్" కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ప్రత్యేకించి ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై వస్తున్న విమర్శలకు స్పందించారు. చిన్నపిల్లలు అత్యాచారానికి గురికావడం ఎంతో బాధాకరమన్న మోడీ.. అత్యాచారాలపై రాజకీయాలు చేయడం అనాగరికమన్నారు. అత్యాచారం ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా అత్యాచారమే అన్న మోడీ.. బాలికపై అత్యాచారాన్ని ఎలా సహించగలమని ప్రశ్నించారు.
ఆడపిల్ల సాయంత్రం ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్లావు, ఎందుకు వెళ్లావు, ఎవరిని కలిశావు అని తల్లిదండ్రులు అడుగుతారు. ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తారు. ఆడపిల్లను అన్నీ అడుగుతున్నారు. మగపిల్లాడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడో అడగండి... అంటూ లండన్ వేదికగా పిలుపు ఇచ్చారు. కానీ ఈ పిలుపు ఇండియాలో ఉన్నప్పుడే ఇస్తే మోడీ విలువ ఇంకాస్త పెరిగేది.