ఏపీలో కుల రాజకీయాలు పెరిగిపోతున్నాయా ? గతానికంటే భిన్నంగా రాజకీయాలు కులాల కుంపట్లను రాజేస్తున్నా యా?. పార్టీలు ఎవరికివారుగా కులాలను తమ వైపు తిప్పుకొనేందుకు యత్నిస్తున్నాయా? ఆపార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలూ కులాలకు వల వేస్తున్నాయా? అంటే తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో తీవ్రస్థాయిలో తలపడ నున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఏపీలో కుల రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో టీడీపీ బీసీలను తన పక్షం చేర్చుకుని ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఆ మాటకు వస్తే బీసీలు ఎప్పుడూ టీడీపీ వైపే ఎక్కువుగా మొగ్గు చూపుతుంటారు. ఇక దీనికి తోడు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి.. ఎన్నికల్లో వేసిన పాచిక పారింది.
ఇక, ఇప్పుడు ఇదే కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాజకీయాలు రంగు తేలుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికి ఉన్న మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేనల అధినేతలను బట్టి చూస్తే వారి వారి సామాజిక వర్గాలను బట్టి ఆయా కులాల వారు ఈ పార్టీలకు మొగ్గు చూపుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన కాపులు ఎటు వెళ్తారనే సందేహం అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఎదురవుతోంది. ఒకపక్క కాపు వర్గానికి చెందిన పవన్ పార్టీ పెట్టిన నేపథ్యంలో కాపులు ఆయన పక్షానికే చేరిపోతారా ? లేక తమకు అనుకూలంగా ఉన్న పార్టీకి ఓట్లేస్తారా ? అనే చర్చ సాగుతోంది. అదేవిధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హవా ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కాపులకు రిజర్వేషన్ ఇస్తానంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. ఎన్నికల్లోగా ఆ అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించి.. కాపులకు ఎర వేయడానికి ప్రయత్నిస్తారనే ప్రచారం కూడా ఉంది. కాపు కార్పొరేషన్ రుణాలు, రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానాలు బాబు ఇప్పటికే చేశారు. ఇక విపక్ష వైసీపీ మాత్రం.. తమకున్న సహజమైన కాపు బలాన్ని నమ్ముకుని కొత్త ఎత్తుగడలకు వెళ్లకుండా నింపాదిగా ఉంది. ఆ రకంగా చూసినప్పుడు.. ఒక్క కులం ఓట్లను చీల్చుకోవడానికి రాష్ట్రంలో మూడు పార్టీలు ముమ్మరంగా కుస్తీలు పడుతున్న సినేరియో కనిపిస్తోంది.
ఇదిలావుంటే, ఇప్పుడు రాజకీయంగా పెనుకుదుపులు ఎదుర్కొంటున్న బీజేపీ కూడా కాపులకే వల విసరాలను నిర్ణయించుకోవడం మరింత సంచలనంగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కమ్మసామాజిక వర్గానికి చెందిన కంభం పాటి హరిబాబును బీజేపీ తప్పించి.. ఆ ప్లేస్లో కాపు వర్గానికి చెందిన వారిని ఎక్కించడం ద్వారా.. కాపులకు గేలం వేయాలని బీజేపీ నిర్ణయించడం ఎన్నికల వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. మొత్తంగా సమాజంలోని మెజారిటీ వర్గాలను ఆకట్టుకునేందుకు కుల రాజకీయాలు బాగానే తెరమీదికి వస్తుండడం గమనార్హం. మరి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.