పవన్ కల్యాణ్ , మీడియా మధ్య యుద్ధం కొత్తపుంతలు తొక్కుతోంది. పవన్ కల్యాణ్ ఏకంగా మీడియా ఛానళ్ల పేర్లు ప్రస్తావిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేకించి టీవీ9, ఏబీఎన్ ఛానళ్లపై ఆయన మండిపడుతున్నారు. ఏబీఎన్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ ఫోటోను మరీ ట్వీట్టర్లో పెట్టి విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈ విమర్శలు చూసి పవన్ అభిమానులు కూడా ఏబీఎన్ పై రెచ్చిపోయారు.
ఫిలింనగర్లోని ఫిలించాంబర్ వద్ద ఏబీఎన్ ఛానల్ లైవ్ వ్యాన్, కారును ధ్వంసం చేశారు. దీంతో ఏబీఎన్ రాధాకృష్ణ చాలా ఆగ్రహంగా ఉన్నారట. పవన్ కల్యాణ్పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. అలాగే, తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఫొటోలు ట్విటర్లో పోస్టు చేసిన పవన్పై పరువు నష్టం దావా వేయాలని శ్రీనిరాజు కూడా నిర్ణయించారుట.
తన తల్లిని శ్రీరెడ్డి కించపరుస్తూ చేసిన కామెంట్లను పదే పదే ప్రసారం చేశారని ఏబీఎన్ ఛానల్ పై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. అయితే నిజానికి పవన్ కల్యాణ్ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను మ్యూట్ చేయడంతోపాటు ఆమె విమర్శించిన తీరును బ్లర్ చేసి ప్రసారం చేశామని ఏబీఎన్ ఛానల్ తన వాదన వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇవేవీ చెక్ చేసుకోకుండానే ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేశారంటోంది.
మరి నిజంగా ఏబీఎన్ రాధాకృష్ణ పది కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు వేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఇలా కేసులు వేసుకుంటూ పోతే పవన్ కూ, మీడియాకూ మధ్య దూరం పెరగడం ఖాయం. మీడియా సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల ముందు ఇలా మీడియాతో గొడవపెట్టుకోవడం పవన్ కల్యాణ్ కు నష్టం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.