ఇప్పుడు ఏపీకి, కేంద్రానికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు వంటి విషయంలో కేంద్రం చేస్తున్న ఉదాశీన వైఖరిని అధికార టీడీపీ తీవ్రస్థాయిలో దుయ్యబడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏకంగా తన పుట్టిన రోజును ధర్మపోరాట దీక్షగా మార్చి కేంద్రంపై మరింత తీవ్రమైన యుద్ధానికి తలపడు తున్నారు. అయితే, ఏపీకి సంబంధించిన అతి రహస్య విషయాలను, కీలకమైన అంశాలను కొందరు ఉన్నతాధికారులే కేంద్రానికి ముందుగా ఉప్పందిస్తున్నారని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ.. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని తెలుస్తోంది. సచివాలయంలో వివిధశాఖాధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారిలో కొందరు నిత్యం ప్రధాని కార్యాలయం అధికారులతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
అంతేకాదు, కేంద్ర మంత్రులతోనూ సదరు అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. విషయాలను చేరవేస్తున్నారని సమాచారం. ఇక, మాజీ ఐఏఎస్ అధికారులతోనూ సమాచారం పంచుకుంటున్న విషయం ఎప్పటి నుంచో తెలిసిందే. సచివాలయంలో పనిచేస్తున్న కొందరు శాఖాధిపతులు.. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు అనుకూలంగా వ్యవహరిస్తు న్నారనే విషయం గత కొన్నాళ్లుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా మాజీ సిఎస్ అజయ్కల్లం కూడా చంద్రబాబును తప్పుపట్టడం..వెనుక కేంద్ర పాలకుల అంతరంగిక అధికారుల పాత్ర ఉందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అజయ్ కల్లంకు అత్యంత సన్నిహితంగా మెలిగి.. కలసి పనిచేసిన అధికారి ఒకరు నిత్యం ఆయనకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి కొందరు ఉన్నతాధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని... దీనిపై ముఖ్యమంత్రి కానీ... ఇంటిలి జెన్స్ విభాగం కానీ..పట్టించుకోవడం లేదని...ఎవరైనా చెప్పినా...కూడా ఫలితం లేకుండా పోతోందని టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు...గంట గంటకు జగన్ సన్నిహితులైన వారికి చేరిపోతున్నాయి. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కూడా ఇక్కడి సమాచారం వెళ్లిపోతోంది. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇక, ఇటీవల చంద్రబాబు చేపట్టిన 12 గంటల ధర్మ పోరాట దీక్ష..కు సంబంధించి ప్రభుత్వం కొంత సొమ్మును ఖర్చు చేసింది. అయితే, ఇది మొత్తం 30 కోట్ల వరకు ఉందని విపక్షాలు ముఖ్యంగా వైసీపీ తెగ విమర్శించింది. దీని వెనుక కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఉన్నాయని సాక్షాత్తూ సీఎంకే సమాచారం చేరింది. సీఎంవో అధికారులు చెప్పకుండా ఖచ్చితంగా రూ.30 కోట్లు ఖర్చు అయిందని వైసీపీ ఎలా ఆరోపించగలుగు తుంది? దీంతో ప్రభుత్వంలో అటు మోడీ, ఇటు జగన్ లేదా వైఎస్ అభిమాన అధికారులు ఉన్నారని, వారి వల్ల ప్రభుత్వంపై విమర్శల పర్వం పెరుగుతోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.