వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో మహాకూటమిని నిర్మించి సంయుక్తంగా ప్రజల వద్దకు వెళతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ‘ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ వచ్చే ఏడాదీ ఉంటాయి. కొత్త మిత్రపక్షాలు కూడా వచ్చి చేరతాయి. మెగా కూటమితో నరేంద్ర మోదీ నేతృత్వం లో పోటీచేయబోతున్నాం’’ అని ఆయన టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కొత్త మిత్రపక్షాలు ఏవేవి, అన్నది ఆయన బయటికి చెప్పకపోయినా- జేడీయూ (నితీశ్), వైఎస్ ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, జేడీఎస్.. లాంటి పార్టీలు ఉండవచ్చని అంచనా.
నరేంద్ర మోదీ పాలననే ప్రధాన నినాదంగా చేసుకుంటున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ‘నాలుగేళ్లలో ఏ కుంభకోణాలూ జరగలేదు. మా మంత్రులు గానీ, ఎంపీలు గానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదు. 2014కు ముందు పరిస్థితితో పోల్చండి.. అప్పట్లో అంతా స్కాముల మయం. రాజకీయంగా కూడా విస్తరించాం. 21 రాష్ట్రాల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించారంటే దానికి మా విధానాలు, పనితీరే కారణం, అట్టడుగు స్థాయికి, గ్రామీణ ప్రాంతాలకు కూడా మేం పరిపాలనను తీసికెళ్లగలగడం మా విజయం. ఢిల్లీలోని విలాసప్రాంతంలో కేంద్రీకృతమైన పాలనను పేదవాడి గుడిసెకు తీసికెళ్లాం.. అదీ మోదీ ప్రభుత్వ ఘనత’’ అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను కర్నాటక అంతటా తిరిగాను. ప్రతీచోటా కాంగ్రె్స-వ్యతిరేక, ప్రభుత్వ- వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన అన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమిత్ షా తొలిసారిగా స్పందించారు. ‘‘సొహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్, ఇష్రత్ జహాన్ కేసు, జడ్జి లోయా మృతి కేసు... ఈ మూడింటిలో నాపై ప్రతికూల ప్రభావం పడింది. నన్ను ప్రత్యేకించి విపక్షం టార్గెట్ చేసింది. ఎందుకో ఏమో నాకు తెలియదు. నేను గతంలోనే చెప్పాను, లోయా కేసుకు ఆధారాల్లేవని! అయినా నాపై ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కానీ త్రిసభ్య బెంచ్ ఓ తీర్పు ఇచ్చినపుడు కనీసం దాన్నై నా మన్నించాలి.
కానీ దానితోనూ విపక్షాలు విభేదించాయి. ప్రజాస్వామ్యంలో ఏదో ఒక పాయింటు దగ్గర- వివాదానికి ముగింపు పలకాలి..కానీ వారు అది చేయట్లేదు’’ అని అమిత్ షా అన్నారు.‘ హిందూ ఉగ్రవాదం’ అన్న పదాన్ని వాడి కాంగ్రెస్ పార్టీ మహాపాపం చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితుల మీద ఆధారాలు లేవన్న కారణంతో వారందరినీ కోర్టువిడిచిపెట్టింది. దానిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ- హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం అన్నపేర్లతో హిందువులందరినీ అవమానించింది అసలు ఉగ్రవాదానికి మతం అనేది ఉంటుందా? మేం టెర్రరిజానికి మతం, రంగు పూయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ దృష్టితోనే చూస్తోంది’’ అని ఆయన విమర్శించారు.
కఠువా అత్యాచార ఉదంతంలో బీజేపీ ఏ తప్పూ చేయలేదని, తటస్థ దర్యాప్తు జరిపించాలని మాత్రమే తమ పార్టీ మంత్రులు కోరారని, నిందితుల పక్షాన వాదించలేదని, నిందితులను అరెస్ట్ చేయవద్దని కూడా కోరలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఘటనకు నైతికబాధ్యత వహించి వైదొలగారని వివరించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీకి కూడా యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని, ఒక్క బీజేపీ నేతకు కూడా ఇందులో ప్రమేయం లేదని స్పష్టం చేశారు.