కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార టీడీపీలో రాజకీయాలు అదురుతున్నాయి. సొంతపార్టీ నేతలే .. తమపై తాము రాజకీయాలు చేసుకుంటూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఏడాది కిందటి వరకు కలసి కట్టుగా ఉన్న భూమా, ఏవీ కుటుంబాలు ఇప్పుడు రోడ్డుకెక్కి కొట్టుకుంటున్నాయి. ఆళ్లగడ్డ అసెంబ్లీ సీటు వ్యవహారంలో తలెత్తిన వివాదం ఇప్పుడు చినుకు చినుకు గాలివానగా మారినట్టుగా మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సైతం చేసుకుంటున్నారు.
నిన్న మొన్నటివరకు ఆరోపణలకే పరిమితమైన నేతల మధ్య ఇప్పుడు ప్రత్యక్ష దాడులు కూడా జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న చంద్రబాబు పిలుపు మేరకు ఏవీ సుబ్బారెడ్డి ఏపీ హక్కుల సాధన పోరాటంలో భాగంగా సైకిల్ యాత్ర నిర్వహించాడు. అయితే, కొందరు ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఏవీ యాత్రపై భారీ ఎత్తున రాళ్లు రువ్వి విధ్వంసానికి తెరదీశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, ఇక్కడే అసలు సిసలు రాజకీయం వెలుగు చూసింది. ఏవీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మంత్రి అఖిల ప్రియ పాత్ర ఉందని, ఆమె కనుసన్నల్లోనే తనపై రాళ్లదాడి జరిగిందని పేర్కొన్నాడు.
అయితే, పోలీసులు మాత్రం ఫిర్యాదు నుంచి అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. ఏవీ ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆధిపత్య రాజకీయాలు ఇప్పుడు కుట్ర రాజకీయాలకు తెరదీశాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఏవీ సుబ్బారెడ్డికి అంతా అనుకూలంగానే ఉంది. అయితే, మంత్రి అఖిల మాత్రం ఏవీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఏవీ చేపట్టిన యాత్రపై కొందరు దాడి చేశారు. నిజానికి ఏవీపై దాడి చేసే దమ్ముధైర్యం ఏ ఒక్కరికీ లేవనేది నిర్వివాదాంశం. అలాంటిది తాజాగా జరిగిన దాడి వెనుక ఎవరూ లేకుండా జరిగే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఏవీవర్గం పేర్కొంటోంది. ప్రత్యక్షంగా ఈ దాడి వెనుక మంత్రి అఖిల హస్తం ఉందని, ఆమె కనుసన్నల్లోనే దాడి జరిగిందని అయినా కూడా పోలీసులు ప్రలోభాలకు గురై.. కేసు నుంచి మంత్రి పేరు తొలగించారని అన్నారు. ఇక, ఈ పరిణామంపై ఏవీ కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారని సమాచారం. పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చినంత మాత్రాన అన్యాయం.. న్యాయం అయిపోదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.