మనం లైవ్ ద్వారా అనేక అంశాలు చూస్తుంటారు.. సభలు, సమావేశాలు, ఆడియో ఫంక్షన్లు ఇలాంటివి.. అదే లైవ్ లో కొన్నిడిస్కషన్లు కూడా హాట్ హాట్ గా సాగుతుంటాయి. కానీ ఓ ఘటనలో ఏకంగా లైవ్ లో ఉన్న విలేఖరినే కొందరు కాల్చి చంపేశారు. ఈ దారుణం లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన నికరాగ్వాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మీడియాపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ వార్త సంచలనంగా మారింది.
అసలేంజరిగిందంటే.. ఆ దేశ అధ్యక్షుడు డేనియేల్ ఆర్టేగా ఇటీవల కొన్ని సంస్కరణలు ప్రతిపాదించాడు. అందులో సామాజిక భద్రతా పథకాల సంస్కరణలు ముఖ్యమైనవి. ఈ సంస్కరణలపై జనంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. అవి కాస్తా ఘర్షణలు, బాంబు దాడుల వరకూ వెళ్లాయి. ఈ అంశాలన్నింటినీ మీడియా ఎప్పటికప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తూనే ఉంది.
నికరాగ్వాలోని ఓ ప్రాంతంలో జనం కోపంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. ఈ వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్ ఏంజెల్ గహోనా వెళ్లారు. అక్కడి పరిస్థితి భయంకరంగా ఉండటంతో లైవ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తన ఛానల్లో అక్కడి పరిస్థితిని లైవ్ లో వివరిస్తుండగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు.
ఆ కాల్పుల్లో రిపోర్టర్ ఏంజెల్ గహోనా అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దారుణమంతా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది. గత బుధవారం నుంచి అక్కడ జరుగుతున్న అల్లర్లలో పాతిక మంది వరకు మరణించి ఉంటారని అంచనా.