మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకీ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను ఆయన ఆ పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఈ నెల 25న ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుంటూరు నగరం నుంచి భారీ ర్యాలీగా తన అనుచరగణంతో వెళ్లి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 25న జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో కొనసాగుతుంది. గన్నవరంలోనే కన్నా వైసీపీ ఎంట్రీ ఉండనుంది.
ఇక కన్నా పార్టీ మారడం వెనక ఆయనకు బీజేపీలో అస్సలు ప్రయారిటీ లేకపోవడమే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా గెలిచిన ఆయన ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ జాతీయ అధిష్టానం కన్నాను కాదని సోము వీర్రాజుకు ఆ పదవి కట్టబెట్టింది. దీంతో కన్నా అలకబూనారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న తనను పార్టీలోకి ఆహ్వానించే సమయంలో.. తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తగిన ప్రాధాన్యం ఇస్తామని మాట ఇచ్చి ఉల్లంఘించారని కన్నా మనస్తాపం చెందారు.
ఇక ఇప్పుడు కన్నా బీజేపీని వీడుతుండడం ఏపీలో బీజేపీకి పెద్ద దెబ్బే అనుకోవాలి. తనకు పదవి ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం వలస నేతగా పరిగణించి దూరం పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకు వస్తే ఏపీ బీజేపీలో మంత్రులుగా పనిచేసిన వారు, కీలక పదవుల్లో ఉన్న వారు సైతం వలసవాదులు కాదా ? అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఏపీకి బీజేపీ చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో ఏపీ జనాల్లో బీజేపీ అన్నా, మోడీ అన్నా తీవ్ర వ్యతిరేకత ఉంది.
బీజేపీలో ఉంటే తమకు ఫ్యూచర్ లేదని ఇప్పటికే చాలా మంది డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే కన్నా కూడా బీజేపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావని డిసైడ్ అయ్యి ఇప్పుడు జగన్ చెంతకు చేరిపోతున్నారు. ఇక కన్నాకు - జగన్ మధ్య రెండు సీట్ల హామీపై డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరుతున్న కన్నాకు పెదకూరపాడు సీటుపై జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కన్నా గతంలో అక్కడ నుంచి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత గుంటూరు వెస్ట్కు మారి ఐదోసారి గెలిచారు. ఇక కన్నా సన్నిహితుడైన ఎన్నారై తేళ్ల వెంకటేశ్ యాదవ్కు ప్రకాశం జిల్లా చీరాల టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.