ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) హెచ్చరించింది. ఏప్రిల్ 24- 26 మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్బంగాల్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ నుండి భారత ప్రధాన భూభాగం తీరం వైపుకు ప్రచండం అలలు దూసుకువస్తున్నాయని ఇన్కాయిస్ తెలిపింది.
అలల ఎత్తు సుమారు 3 నుండి 4 మీటర్ల ఎత్తులో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ అలలు తీరానికి సమీపించే సమయంలో ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా నిరోధించాలని స్పష్టం చేసింది. సముద్ర ఉపరితలం నుంచి గాలులు 45- 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్టు పేర్కొంది.
సముద్ర స్నానాలు, చేపల వేటను రెండు రోజులపాటు నిలిపివేయాలని ఇన్కాయిస్ సంస్థ సలహా ఇచ్చింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కన్యాకుమారి తీరంలో ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చొకొచ్చింది. కేరళలో వందకు పైగా ఇళ్లు సముద్రపు అలలు కారణంగా ధ్వంసమయ్యాయి.
తీరప్రాంతంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి గత గురువారం ఇన్కాయిస్ హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో అలలు ప్రమాదకరస్థాయిలో ఎగిసిపడతాయని ఇన్కాయిస్ శాస్త్రవేత్త డాక్టర్ హరికుమార్ పేర్కొన్నారు.