పవన్ కల్యాణ్ తాజా తీరుపై విమర్శకుడు కత్తి మహేశ్ విరుచుకుపడుతున్నారు. ఆయన తీరును విశ్లేషిస్తున్నారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన యువకులను పవన్ ప్రోత్సహించడం దారుణం అన్నారు. తన మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కళ్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? అని ప్రశ్నిస్తున్నారు.
మొన్నటి ఫిలింఛాంబర్ ఘటననూ కత్తి మహేశ్ గుర్తు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు. దీని వెనక ఒక హింసాత్మక కుట్ర పునాది దాగుందని నాకు అనిపిస్తే అది నా తప్పే అవుతుందంటున్నాడు కత్తి మహేశ్.
రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్ కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద. పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడికి సృష్టించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర ఇది. మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ళ చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉందంటూ కత్తి మహేశ్ హెచ్చరిస్తున్నాడు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టింపబడుతుంది. పవన్ ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చంటూ భవిష్యత్తును అంచనా వేస్తున్నారు కత్తి మహేశ్..