సోము వీర్రాజు. బీజేపీ సీనియర్ నేత. ప్రస్తుతం ఎమ్మెల్సీ. గత వారం రోజులుగా ఈయన పేరు మీడియాలో భారీ ఎత్తున వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఈయనకేనని, దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా పచ్చజెండా ఊపిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి వరకు ఏపీ బీజేపీని నడిపిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మెతక వైఖరి అనుసరించారని, ఏపీ అధికార పార్టీ టీడీపీని కట్టడి చేయలేకపోయారని, నేరుగా కేంద్రంపై టీడీపీ విమర్శలు చేస్తున్నా.. ఆయన పట్టించుకోలేదని, సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని కేంద్రంలోని బీజేపీ పెద్దలు భావించినట్టుగా కూడా ఏపీలో ప్రచారం జరిగింది.
అదేసమయంలో కేంద్రం ఏపీపై చూపించిన ప్రత్యేక అభిమానాన్ని, కేంద్రం చేసిన సాయాన్ని, రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా హరిబాబు ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఏపీకి కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారనే విషయాన్ని కానీ వివరించడంలో విఫలమయ్యారని అందుకే ఆయనను పదవి నుంచి తప్పించి కేంద్రంలో ఏదో ఒక పదవి ఇవ్వనున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ఎప్పటి నుంచి ఏపీ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్న సోము వీర్రాజు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇకేముంది బీజేపీ అధిష్టానం నుంచి ప్రకటన రావడమే తరువాయని సంతోషంలో మునిగి తేలారు.
ఇక, ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ రాజకీయ దిగ్గజం, గుంటూరుకు చెందిన నేత కన్నా లక్ష్మీనారాయణ తనకు అధ్యక్ష పీఠం దక్కక పోయే సరికి అలిగి ఏకంగా పార్టీ మార్పునకే సిద్ధమయ్యారు. ఆయన రేపో మాపో పార్టీ మారిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్తితి. అయితే, తాజాగా బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం.. సోమును అధిష్టానం పక్కన పెట్టింది. ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇవ్వడం అనే అంశాన్ని ఇలా పరిశీలించి అలా పక్కన పెట్టేశారట! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని అంటున్నారు బీజేపీ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా ఉండే రాష్ట్ర బీజేపీ నేతలు.
ఇక, సోముకు ఎందుకు ఆ పదవి దక్కడం లేదో కూడా ఆఫ్ ది రికార్డుగా ఈ నేతలు చెప్పుకొచ్చారు. వీరు చెప్పిన విషయాన్ని బట్టి.. సోముకు నోటి దురద ఎక్కువని, ఎవరినైనా ఎంతటి మాటైనా అనేస్తారని, విపక్షం అనగానే కొంత సంయమనం, కొంత ఆవేశం ప్రదర్శించాలని, కానీ, సోముకు కోపం వస్తే.. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదని ఇవి మైనస్గా మారాయని అన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పాగా వేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన పక్షాలతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని, అయితే, సోముకు ఆ రేంజ్లో పరిచయాలు లేకపోవడం మరింత ఇబ్బందిగా మారిందన్నారు.
ఇక, పార్టీ మొత్తాన్ని నడిపించాలంటే.. వివిధ సమస్యలను పరిష్కరించగలిగే సత్తా.. ఆయా సమస్యలపై ఆచి తూచి వ్యవహరించగలిగే నేర్పు అవసరమని ఈవిషయంలోనూ సోము ఆవేశమే తప్ప ఆలోచించి అడుగు వేసింది లేదన్నారు. ఈ సందర్భంగా సోము గతంలో చేసిన ఆరోపణలను వారు ఆఫ్ది రికార్డుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం సోమును పక్కన పెట్టిందన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఐపీఎస్ కు స్వచ్ఛంద రాజీనామా సమర్పించిన జేడీ లక్ష్మీనారాయణను కేంద్ర బీజేపీ వర్గాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి జేడీ రాక మాట అటుంచితే.. సోముకు మాత్రం నోటి దురద, ఆలోచన లేకుండా పోవడం వంటివి ఆయనకు పదవిని దూరం చేశాయనే చెప్పాలి.