గత కొంత కాలంగా భారత దేశంలో దొంగ బాబాలు విపరీతంగా పెరిగిపోయారు. ఇప్పటికే పలువురు దొంగ బాబాల గుట్టు బయట పడటంతో జైలు పాలు అయ్యారు. ఆ మద్య ఇద్దరు యువతలపై అత్యాచారం కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా. ఇక తన ఆశ్రమంలో 16 బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపుపై కేసు నమోదై జైలు పాలయ్యారు. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఆశారాం బాపుపై నమోదైన అత్యాచార కేసులో తుది తీర్పు వెలువడింది.
జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ కొనసాగింది. అత్యాచార కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ శర్మ తీర్పు వెల్లడించారు. ఐదేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో.. ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. గుర్మీత్ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని విచారణను జోధ్ పూర్ జైలు లో చేపట్టాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది.ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 7నే వాదనలు పూర్తవగా.. ఆశారాంను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెల్లడించింది.
ఆశారాంను దోషిగా తేల్చడంతో.. జోధ్పూర్ అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా.. దేశవ్యాప్తంగా ఆశారాం ఆశ్రమాలపై గట్టి నిఘా ఉంచారు.