కడప అంటే వైసీపీకి కంచుకోట. ఇక్కడ జగన్ పేరు చెబితే చాలు ఓట్లు పడిపోయేంత ఆదరణ వైసీపీ నేతల సొంతం. అందుకే 2014లో ఇక్కడ వైసీపీ భారీ ఎత్తున గెలుపొందింది. అయితే, ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైసీపీ తరఫున గెలుపొందిన నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చే ఎన్నికల నాటికి వీరి తలరాతలు ఏమైనా మారతాయా? ప్రజల్లో వీరికి ఎలాంటి ఆదరణ ఉంది? వంటి కీలక అంశాలపై చర్చ నడుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో ప్రతి ఒక్కరి దృష్టీ.. వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడపపైనే పడడం గమనార్హం. మరి ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. కడపలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో వైసీపీ 9 సీట్లలో జయకేతనం ఎగుర వేసింది. కడప ఎంపీ సీటును సైతం వైసీపీ ఖాతాలో వేసుకుంది. మొత్తంగా జిల్లాలో గట్టి పట్టు సాధించింది వైసీపీ.
అయితే, అధికారం దక్కక పోయే సరికి నేతల్లో నిరుత్సాహం ఏర్పడింది. చాలా మంది నేతలు జంప్ కూడా చేసేశారు. మరి ఇప్పుడు వారేం చేస్తున్నారో చూద్దాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ప్రజలకు దగ్గర కావడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలోని బంగారు రెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, శివచంద్రారెడ్డి, మురళీధర్రెడ్డి, డాక్టర్ ఎంవీ రమణారెడ్డిలు వైసీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ ఎంవీ రమణారెడ్డి, శివచంద్రారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉంది. స్థానికంగా తరచూ గొడవలు పడుతూ వస్తున్నారు. పేరుకు ఎమ్మెల్యే అయినా పెత్తనం ముఖ్య నేతలదేనన్నట్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొంది.
మైదుకూరు నియోజకవర్గంలోని శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వైసీపీలో మరో ప్రధాన నేతగా ఉన్న ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డిని డీసీసీబీ పదవి నుంచి తప్పించడంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె పాత్ర ఉందని ఆయన భావిస్తూ అంతర్గతంగా ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా సుధీర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే బాధ్యతల కోసం ప్రభావతి పోటీ పడినా జగన్ సుధీర్రెడ్డికే బాధ్యతలు అప్పజెప్పడం, ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ పార్టీకి దిక్కుగా ఉన్నారు.
జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల బాధ్యతలను ఎంపీ అవినాష్రెడ్డి చూస్తుండగా గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గ్రూపు ప్రభావం కొంత ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నుంచి ఆయన మౌనం పాటిస్తున్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మూడవ సారి హ్యాట్రిక్ కొట్టినా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు జగన్ను కలిసి ఎమ్మెల్యే శ్రీనివాసులుపై ఫిర్యాదు చేశారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూనే అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి రైల్వేకోడూరు ఇన్ఛార్జ్ బాధ్యతలను చూస్తున్నారు. ఇక్కడ అభ్యర్ధిని మార్చాలన్న డిమాండ్ నేతల నుంచి వినిపిస్తోంది.
రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆకేపాటి అమర్నాధరెడ్డి ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని ధీటుగా ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా నేతల్లో అసమ్మతి నెలకొనడం కూడా కొంత ఇబ్బం దులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్కు చేసింది ఏమీలేదని బహిరంగంగానే చర్చిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే తనయుడు మండిపల్లె రాంప్రసాద్రెడ్డిలు కీలక వ్యక్తులుగా ఈ నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరు గానే సాగిస్తున్నారు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ఉన్నా కేడర్లో అసంతృప్తి నెలకొంది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి జోరు ఎక్కువగానే ఉంది. అయితే, ఆయన కిందిస్థాయి నాయకులను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇలా .. మొత్తంగా కడపలో వైసీపీ పరిస్థితి ఉగాదిపచ్చడిని తలపిస్తోంది.