ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ప్రత్యేక హోదా విషయంలో పెద్ద ఉద్యమమే నడుస్తుంది. కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొన్నటి వరకు బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిన టీడీపీ ఇప్పుడు కేంద్రంపై యుద్దం ప్రకటించింది. ఎన్టీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ కేంద్ర మంత్రులచే రాజీనామాలు చేయించింది. దశల వారీగా కేంద్రానికి దిమ్మతిరిగేలా ఉద్యమం చేపట్టాలని టీడీపీ ఆలోచనలో ఉంది.
ఇప్పటికే విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ, జనసేన పార్టీ నేతలో రహస్య మంతనాలు జరపుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తాజాగా వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ..అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ పోరాటం చేస్తున్నారని..కానీ ప్రతిపక్ష హోదాలో ఉండి మద్దతు పలకడం మానేసి లేనిపోని బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెబుతున్న జగన్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
వైసీపీ రాజీనామాలు చేసి ప్రజలకు పంగనామాలు పెడుతోందని, డ్రామాలాడుతోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని చెబుతున్న జగన్ కు ప్రధాని మోదీని విమర్శించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇక జనసేన నేత పవన్ కళ్యాన్ మొన్నటి వరకు స్నేహ సంబంధాలు కొనసాగించి ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారని..తనపై పవన్ చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, ఆధారాలుంటే నిరూపించాలని, నీచరాజకీయాలు చేసే చరిత్ర టీడీపీది కాదని లోకేశ్ అన్నారు.