లైంగికదాడి కేసులో ఆశారం బాపునకు జీవితఖైదు పడిన ఘటన దేశవ్యాప్తంగ సంచలన రేపుతున్న వేళ.. ఆయన అనుచరులు మాత్రం మోడీని అదేనండీ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని ప్రతినబూనుతున్నారు. ఇంతకీ బీజేపీపై ఆశారాం బాపు అనుచరులకు ఎందుకంత కోపం వచ్చింది? ప్రధాని మోడీకి ఆశారాంబాపునకు సంబంధం ఏమిటి? ఆశారాం బాపునకు జీవితఖైదు పడడంలో బీజేపీ హస్తం ఉందా..? ఇప్పుడివే ప్రశ్నలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి.
అయితే ఆశారాం బాపునకు శిక్ష పడడంలో మాత్రం బీజేపీ హస్తం ఉందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని అంటున్నారు. బీజేపీ ప్రమేయంతోనే బాపునకు వ్యతిరేకంగా తీర్పువచ్చిందని అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన కూడా విడుదల చేసి, సంచలనం సృష్టించారు. కోట్లమంది బాపు అనుచరులు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతారు.. అనే శీర్షికతో ఈ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జడ్జి లోయా కేసులో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రసావిస్తూ కోర్టు నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.
ఢిల్లీలోని ఆయన ఆశ్రమంలోని కొందరు భక్తులు మాట్లాడుతూ తమ గురువు తప్పు చేశారనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోమని అన్నారు. ఆశారాం బాపు కోసం వారు ఉపవాస దీక్ష ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఆశారాం బాపునకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. సుమారు నాలుగుకోట్ల మంది అనుచరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన సంస్థలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఆశారాం బాపునకు బీజేపీ పాలిత రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు.
ఆయనకు జీవిత ఖైదు పడడంలో బీజేపీ హస్తం ఉందంటూ అనుచరులు ఆరోపించడం.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రతినబూనడం రాజకీయా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆశారాం బాపుతో ప్రధాని మోడీ ఓ కార్యక్రమంలో సన్నిహితంగా ఉన్న వీడియేను విడుదల చేసింది. తాజాగా బాపు అనుచరులు కూడా ఆగ్రహంతో ఉండడంతో ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.