నారా లోకేశ్, నారాయణ.. ఇద్దరూ చంద్రబాబు సర్కారులో కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న మంత్రులే.. కానీ ఇప్పుడు చంద్రబాబు లోకేశ్ ను కాపాడేందుకు నారాయణను ఇరికించడానికి కూడా రెడీ అయ్యారా.. అంటే అవునంటోంది వైఎస్సార్ సీపీ.. ఇటీవల చంద్రబాబు అన్న క్యాంటీన్ల పథకం కోసం 380 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే..
ఐతే.. ఈ సొమ్ములో చాలావరకూ నారాలోకేశ్ ఖాతాలోకి వెళ్తుందని.. చంద్రబాబువి అన్నా క్యాంటీన్లు కాదు.. అల్లుడి క్యాంటీన్లు అని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. అందుకనే చంద్రబాబు తెలివిగా ఈ క్యాంటీన్లను కేవలం అర్బన్ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ లాజిక్ లాగి మరీ చెబుతోంది. మంత్రి నారాయణను ఇరికించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చాడని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్లు కేవలం అర్బన్లోనే ఏర్పాటు చేస్తున్నారని, రూరల్లో పెడితే.. అది లోకేష్ శాఖకు వెళ్తుందని ఆయన అంటున్నారు. రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ల అవినీతిపై ఎంక్వైరీలు జరిగితే.. నారాయణ ఇరుక్కుంటారు.. లోకేష్ తప్పించుకుంటాడనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆర్కే వివరించారు. మంత్రి నారాయణ కూడా ఈ విషయాలను గ్రహించాలని ఆర్కే సూచించారు.
పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఎన్టీఆర్ పేరు వాడకూడదనే ఉద్దేశంతో పని చేసి ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టబోతున్నట్లు ప్రకటిస్తున్నాడన్నారు. చంద్రబాబు పెట్టే అన్నా క్యాంటీన్లు.. అల్లుడి క్యాంటీన్లుగా ప్రజలంతా భావిస్తున్నారన్నారు.