దాదాపు ఏడాది కాలం ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారపీఠం ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరబాటే అవుతుందనుకుంటున్నా.. వచ్చే ఎన్నికలపై కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు గతంతో పోలిస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు ముఖాముఖి జరిగింది. జనం కాంగ్రెస్ ను పూర్తి గా పక్కకు పెట్టేశారు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు ఉన్నాడు. కానీ ఇప్పుడు పవన్ సొంత శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు జగన్ కూడా బలమైన శక్తిగానే కనిపిస్తున్నాడు. వీరిద్దరితో పోలిస్తే సీనియర్ అయిన చంద్రబాబు కళ కాస్త తగ్గినా విజయం కోసం అన్ని శక్తియుక్తులూ కూడదీసుకోగల సమర్థుడు.
చాలా మంది ఊహిస్తున్నట్టు పవన్, జగన్ ఒక్కటవ్వడం కూడా అంత సులభం కాదు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉన్నా.. ఎన్నికల ముందు మాత్రం పవన్, జగన్ కలిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందులోనూ పవన్ ఇటీవల తానే టీడీపీ వ్యతిరేక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. సో.. ముక్కోణ పోటీ తప్పదన్నమాట.
ఈ ముక్కోణ పోటీలో ఫలితం పూర్తిగా ఏ ఒక్కరి వైపో వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పవన్ కు తక్కువ సీట్లు వచ్చినా.. కాబోయే సీఎంను డిసైడ్ చేసే అవకాశం ఆయనకు దక్కే ఛాన్సులు ఉన్నాయి. అంటే తొలిసారిగా ఏపీ రాజకీయాల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటి దృశ్యం.. ఇంకా ఏడాది సమయం ఉన్నందువల్ల ఇంకెన్ని సమీకరణాలు మారతాయో..!?