ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెనుప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. గురువారం (ఏప్రిల్ 26) ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఓ దశలో అది కూలిపోతుందనే భావించారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో రాహుల్ ప్రాణాల తో బయటపడ్డారు.
అయితే రాహుల్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత మొట్టమొదటగా ఆయనకు ఫోన్ కాల్ చేసిందెవరో? ఊహించండి! ఆయనెవరో కాదు. ప్రధాని నరెంద్ర మోదీయే. రాహుల్ గాంధి ప్రయాణించే విమానానికి జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు కాల్ చేశారట. ప్రమాదం తీరు, రాహుల్ బాగోగుల గురించి ఆరా తీశారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.
రాహుల్కు జరిగిన ప్రమాదం విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదనడానికి ప్రధాని స్వయంగా రాహుల్కు ఫోన్ చేయడమే నిదర్శనమని బీజేపీ నేతలు చెబు తున్నారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రాహుల్కు 'ఎస్పీజీ కమాండోస్' తో 'హై-లెవల్ సెక్యూరిటీ' కల్పి స్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉండొచ్చునని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాహుల్ బృందంలోని సభ్యుడు కౌశల్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కర్ణాటక డీజీపీ నీల్మణి ఎన్.రాజుకు లేఖ రాశారు.
గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో రాహుల్.. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కర్ణాటక లోని హుబ్బళికి బయల్దేరిన చార్టర్డ్ విమానంలో 10.45గంటలకు సాంకేతిక సమస్య తలెత్తింది. తీవ్రమైన కుదుపులతో విమానం ఒక పక్కకు వాలిపోయింది. దాదాపు కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, పైలట్లు తీవ్రంగా శ్రమించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
సాంకేతికసమస్య తర్వాత విమానం దాదాపు 40నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానాన్ని సురక్షితంగా కిందకి దింపేందుకు పైలట్లు రెండుసార్లు విఫలయత్నం చేశారు. చివరికి మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ‘ఆటో పైలట్ మోడ్’ లో సమస్య తలెత్తడం వల్లే సాంకేతిక సమస్య ఏర్పడిందని డీజీసీఏ తెలిపింది. పైలట్లు విమానాన్ని ‘మాన్యువల్ మోడ్’ లోకి తీసుకొచ్చి, సురక్షితంగా ల్యాండ్ చేశారని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ ప్రమాదం వెనుక ఎదో ఒక కుట్ర కోణం దాగి ఉంది అంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనితో రంగం లోకి దిగిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిఎషన్ ఈ ప్రమాదం పై లోతైన విచారణకు ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాహుల్ ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కాంగ్రెస్ కు అక్కడ అధికారం దక్కేవిషయం చివరి వరకు వచ్చి- పూర్తి మెజారిటీ సాధించలేక చతికల పడుతుంది అని వస్తున్న ‘ఒపీనియన్ పోల్ రిపోర్ట్’ లను చూసి రాహుల్ గాంధీ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్.