సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వరద్దు కేసు తాజాగా మరో మలుపు తిరిగేలా ఉంది. ప్రభుత్వానికి ఇందులో కొత్తగా టెన్షన్ మొదలైంది. వీరిద్దరి సభ్యత్వాలను శాసనసభరద్దు చేయడం, అనంతరం హైకోర్టు జోక్యం చేసుకుని శాసనసభ నిర్ణయాన్ని కొట్టివేయడం జరిగిన విషయం అందరికి తెలిసిందే. వారిద్దరూ ఎమ్మెల్యేలు గానే ఉంటారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. వారి సభ్యత్వరద్దు కు సంబందించి తెలంగాణ శాసనసభ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఛాలెంజ్ చేసింది. టిఆర్ఎస్ శాసనసభ్యులు మళ్లీ హైకోర్టు కు అప్పీల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై నిన్న (30.04.2018) సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల నుండి వాదనలు విన్నారు. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించగా, టిఆర్ఎస్ శాసనసభ్యుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకెట్ వైద్యనాథన్ వాదించారు.
తెలంగాణ ప్రభుత్వం వీడియోలు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. (శాసనసభ) హౌస్ నుండి కేవలం స్పీకర్, కార్యదర్శి లకు మాత్రమే ఈ విషయంలో పిటిషన్ వేసే అర్హత ఉందని అభిషేక్ సింఘ్వీ వాదించారు. అసలు ఎమ్మెల్యేలకు పిటిషన్ వేసే అర్హతే లేదన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసు కునే హక్కులేదన్నారు.ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత కూడా లేదని వాదించారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం హౌస్ మాత్రమే పిటిషన్ వేయాలని పేర్కొన్నారు. అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న తర్వాత కేసును బుధవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.
ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలు రద్దుకావడం, ఆ రద్దును హైకోర్టు రద్దు చేయడం జరిగిపోయింది. అయితే సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఫుల్ బెంచ్ కి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే ఈ కేసు వేసిన ఎమ్మెల్యేల్లో "కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నుండి - పార్టీ ఫిరాయించి టిఆరెస్లో చేరిన ఎమ్మెల్యేలు" కూడా ఉన్నారని, వారి వాదనకు అసలు నస తప్ప, పస ఉండదని కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు.
మొత్తానికి కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వరద్దు కేసు మరోమలుపు తిరుగుతుందా? లేక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేస్తుందా? అన్న ఆత్రుత ఆశక్తి టెన్షన్ అందరిలోను పెల్లుభుకుతుంది. రేపు అంటే బుధవారం (02.04.2018) ఈ కేసు భవితవ్యం తేలనుందని ఎవరికి ఘాటైన షాక్ తగుల్తుందోనని న్యాయవర్గాలు అంటున్నాయి.