రాజకీయనాయకుల మాటలకు అర్ధాలే వేరు. కాలికెస్తే
మెడకు మెడకేస్తే కాలికి వెయ్యటం వారికి అలవాటే. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, ఆ
సర్వాంతర్యామికే తెలియాలి.
*ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, *ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని నాడు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అయితే తిరుపతి ఎన్నికలసభలో ప్రత్యేక హోదా ఇస్తామని నాడు నరేంద్రమోదీ ప్రకటన చేయలేదని అయితే వెంకన్న సాక్షిగా ప్రకటన చేసినట్లుగా సీ ఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించేలా చేస్తున్న ప్రకటనలను మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ్ డిమాండ్ చేశారు.
తిరుపతిలోని ఓ హోటల్లో ఆదివారం విలేఖరుల సమావేశంలో నెల్లూరులో మోదీ ప్రసంగ పాఠంలో కొంత భాగాన్ని వీడియో క్లిప్లింగ్లను మీడియాకు చూపించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలని కోరినట్లుగా ఢిల్లీలో విలేఖరుల ముందు ప్రదర్శించిన వీడియోను కూడా ప్రదర్శించారు.
నెల్లూరులో నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వెనుక వెంకయ్యనాయుడు కృషి ఉందన్న వ్యాఖ్యలను బీజేపీనేతలు విలేఖరులకు చూపించారు. అదే సమయంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన వీడియోలో ప్రత్యేక హోదా అడిగినట్లుగా ఉన్న క్లిప్పింగ్స్ను బాబు మార్ఫింగ్ చేయించాడని బీజేపీ నేతలు ఆరోపించారు. అలాంటప్పుడు చట్టపరమైన చర్యలపై ఎందుకు దృష్టి పెట్టలేదని విలేఖరులు బీజేపీ నేతలను ప్రశ్నించారు.
చట్టపరంకన్నా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని సమాధానమిచ్చారు. నరేంద్రమోదీ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తిరుపతి లో మోదీ చేసిన నాలుగు పేజీల ప్రసంగం పాఠాన్ని విలేఖరులకు అందించారు.
ఇందులో వెనుకబడిన గుజరాత్ను ముఖ్యమంత్రిగా తాను ఎలా అభివృద్ధి చేశానో ప్రధానిగా తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని అలా అభివృద్ధి చేస్తానని అన్నారన్నారు. అలాగే సీమాంధ్రను హైదరాబాద్ తరహా లో హైటెక్ సిటీగా తయారుచేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో మోదీ వివరించిన తీరును తెలియ జేశారు. సీమాంధ్రలో ఉన్న విశాఖ సాగరతీరాన్ని ఉపయోగించుకుని విశ్వవాణిజ్యరంగంలో ఎలా ఎదగవచ్చో వివరించినట్లు చెప్పారు. ఏపీలో సంపదను సృష్టిస్తానని, ప్రపంచం దృష్టి ఏపీ వైపు మళ్లేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను ప్రసంగం పాఠంలో ఉన్నట్లు తెలిపారు. గంగా, కావేరి నదుల అనుసంధానం అటల్ బిహారీ వాజ్పాయ్ కలలను సాకారం చేస్తానని మోదీ చెప్పినట్లు వివరించారు.
మిత్రులారా! ఏడుకొండల పాదాల సాక్షిగా
చెబుతున్నా కేవలం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంకాదు, సీమాంధ్రను స్వర్ణాంధ్రగా
మార్చుకోవడానికి ఈఎన్నికలు ముఖ్యమని అందుకు 'ఒక ఓటు టీడీపీకి, మరొక ఓటు బీజేపీ' కి
వెయ్యాలని తెలిపారన్నారు. తద్వారా ఏపీలో 25మంది ఎంపీలను కేంద్రానికి పంపి సీమాంధ్ర
అభివృద్ధికి పునాది వేయాల ని కోరినట్లు తెలిపారు. ఢిల్లీలో స్థిరమైన, ధృడమైన
ప్రభుత్వం కావాలి. అందుకు సహ కరించండి. చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయండి
అన్నారన్నారు. కేంద్రంలో బీజేపీకి పట్టం కట్టాలని కోరినట్లు మోదీ ప్రసంగ పాఠాన్ని
సవివరంగా తెలియజేశారు. ఈసందర్భంగా ఆంధ్ర రాజధాని ని డిల్లీకి మించిన విధంగా తయారు
చేయడానికి అండగా ఉంటానని మోదీ అన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వీర్రాజు,
మాధవ్ మాట్లాడుతూ, ఏడుకొండలవాని సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ
చేయని ప్రకటనను తిరుపతిలో చేసినట్లు ఆమాటలకు వెంకన్న సాక్షి అన్నపదాన్ని
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోడించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇకనైనా చంద్రబాబు వెంకన్న సాక్షి అనే పదాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.