గుంటూరు కు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ ఏంటి? నిన్న మొన్నటివరకు వైసీపీలో చేరుతున్నారని వచ్చిన వార్తలు.. ఇప్పుడు సడెన్గా టీడీపీవైపు ఎందుకు మళ్లాయి ? ఇక, ఇప్పుడు ఆయన బీజేపీలోనే కొనసాగుతారంటూ.. ఆ పార్టీ నేతలు లోపాయికారీగా మీడియాకు లీకులు ఎందుకు ఇస్తున్నట్టు? ఇక, కన్నా భవిష్యత్ ఎలా ఉండనుంది? రాబోయే 15 రోజుల్లో కన్నా ఎటు వైపుగా నడవనున్నారు ? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలే గుంటూరు రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి. గడిచిన రెండు మూడు రోజులకు ముందు భారీ ఎత్తున వార్తల్లో నిలిచిన కన్నా.. ఇప్పుడు ఏదిశగా ముందుకు వెళ్తారనే చర్చ సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీలో పట్టు సాధించారు.
అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. అయితే, ఈ పార్టీలో ఆయనకు అనుకున్న రేంజ్లో గుర్తింపు రాలేదు. దీంతో గత కొన్నాళ్లుగా కన్నా మనస్తాపంతోనే కాలం గడుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోకపోవడం ఆయనకు ఇబ్బంది కలిగించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. దీంతో ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోమని కొందరు సూచించగా, వైసీపీలో చేరమని మెజారిటీ నేతలు విజ్ఞప్తిచేశారు. దీంతో కన్నా వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దీనిపై దృష్టి పెట్టిన వైసీపీ నేతలు ఆయనకు పెదకూరపాడు నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామని ప్రతిపాదించారు. కన్నా సూచించిన మరో నేతకి కూడా టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
దాదాపు ఆయన చేరిక కూడా ఖాయమైంది. అయితే, ఇంతలోనే కన్నా చేరిక ఆగిపోయింది. అయితే, ఈ క్రమంలోనే మరో విషయం వెలుగు చూసింది. వైసీపీ కంటే ముందే తెలుగుదేశం నేతలు కన్నాకి టచ్లోకి వచ్చారని సమాచారం. ఓ మంత్రి ఆయనకి ఫోన్చేసి మాట్లాడారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కన్నా కూడా స్పందించారు. పార్టీలోకి వచ్చేందుకు తాను సిద్ధమే అయినప్పటికీ తనకు ఎటువంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. తాను పార్టీ అధినేతతో మాట్లాడి చెబుతానని ఆ మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత సదరు మంత్రి ఫోన్ చేయలేదు. క్యాబినెట్లోని మరో మంత్రి కన్నాతో ఫోన్లో మాట్లాడారు. అయితే ఆయన నుంచి కూడా నిర్ధిష్టమైన హామీ లభించలేదు. అధినేత నుంచి క్లియరెన్స్ వచ్చినప్పటికీ, ఆ మంత్రులు సరిగా డీల్ చేయలేకపోయారు. దీంతో సరైన సమాధానం అందకపోవడంతో కన్నా వైసీపీలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇక, ఇంతలోనే కన్నా బీజేపీకి రాం రాం చెబుతున్నట్టు తెలుసుకున్న బీజేపీ అధికార ప్రతినిధి రామ్మాధవ్ లైన్లోకి వచ్చి.. పార్టీలోనే ఉండాలని కోరారు. దీంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక కన్నా సతమతం కావడంతోనే ఆరోగ్యం దెబ్బతిందని సమాచారం. ఇక, పార్టీల విషయానికి వస్తే.. కన్నా టీడీపీలోకి చేరితే ఆయన వల్ల పార్టీకి తప్పనిసరిగా ప్రయోజనం చేకూరి ఉండేదనిసీనియర్ నేతలు అంటున్నారు. ఇక, వైసీపీ ఎంట్రీ కూడా ప్రస్తుతానికి సందిగ్ధంలోనే పడింది. దీంతో కన్నా దిశ ఎటు ? అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి దీనికి కన్నా ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి. అయితే, టీడీపీ నేతలు .. వైసీపీ కన్నా ముందుగానే కన్నాను లైన్లో పెట్టుకోవాలని చూసినా.. ఏ కారణాల చేతో ఆయనను లైన్లోకి తీసుకురాలేక పోవడం గమనార్హం. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.