ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ప్రత్యేక హోదాతోపాటు, విభజన హామీల సాధన దిశగా అధికార పార్టీ టీడీపీ కేంద్రంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో భాగంగా ఇప్పటికే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది. అంతే కాదు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో పోరాడారు. సమావేశాలు ముగిశాక… ఉద్యమానికి రాష్ట్రమే వేదికైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.
నియోజక వర్గాల్లో నేతలు సైకిల్ యాత్రలు చేశారు. ఆ తరువాత, తిరుపతిలో ధర్మపోరాట సభ పెట్టారు. ఆ తరువాత… ఈ నెల మూడోవారంలో విశాఖపట్నంలో రెండో ధర్మపోరాట సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించే నాటికి అమరావతిలో చివరి సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అంటే, ఇకపై నెలకో సభ నిర్వహణపైనే అధికార పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్టు అర్థం చేసుకోవాలి.
హోదా ఉద్యమాన్ని, ప్రజల్లో ఇప్పుడున్న సెంటిమెంట్ ను కొసాగించాలంటే ఇలా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలను మమేకం చేయడం టీడీపీ లక్ష్యంగా భావిస్తుంది. ఈ ఏడాదిలోగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చెయ్యాలి. పార్లమెంటు నిరవధిక వాయిదా తరువాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక హోదాపై ఎంత ఉద్యమిస్తున్నా… అది తమకు సంబంధం లేని విషయం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉంటోంది.
పార్లమెంటులో టీడీపీ నిలదీయడం, అవిశ్వాస తీర్మానం, సీఎం ఢిల్లీ పర్యటన… ఈ క్రమంలో కొంతైనా కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా సెంటిమెంట్ ని ఎలా వర్క్ ఔట్ చేసుకోవాలో అలా చేసుకునే ప్రయత్నంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది.