ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనల్ని గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా కన్నడిగులు సౌమ్యుల్లా కనిపించినా వాళ్ళని టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. మిరియం గింజ చూట్టానికి ఏమంత గొప్పగా ఉండదు కొరికితే తెలుస్తుంది మంత. అలాంటి వాళ్ళే కన్నడిగులు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రహసనంలో తన బాధ్యత నిర్వహిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి ఊహించని ఝలక్ ఇచ్చారు కన్నడిగులు.
కన్నడ ఓటర్లు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె ఉక్కిరి బిక్కిరయ్యారు. కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది నాయకులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బీజేపీ మహిళా మోర్చా ఇంఛార్జ్ పురందేశ్వరి కూడా గత కొన్ని రోజులుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తెలుగు రైతు ఆమెను సంచలనం రేపుతూ కళ్ళు తెరిపించే ఆసక్తికర ప్రశ్న అడిగారు.
“అమ్మా! నువ్వు గత ఎన్నికల్లోనూ ప్రచారానికి ఇక్కడికి వచ్చావు కదా! అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నావు. ఇప్పుడు మళ్లీ వచ్చి బీజేపీకి ఓటేయమంటున్నావు. నాడు కాంగ్రేస్ నేడు బిజెపి ఏపీకి అన్యాయం చేసిన పార్టీలే. అలాంటి వారివైపే అంటే మనకు అపకారం చేస్తున్న వారివైపే ఎందుకు ఉంటున్నావమ్మా?” ఈ విధంగా ఆ రైతు వేసిన ప్రశ్న మెత్తగా ఉన్నా ఆమెకు లోలోపల మంటెత్తించింది. అదీ నసాళానికి ఎక్కించే మంత మరి.
దీనికి పురందేశ్వరి ఏమని జవాబు చెబుతారు! శ్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ టిడిపి, కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి ఇలా వాళ్ళపంచన వీళ్ళపంచన బ్రతకాల్సిన అవసరం ఈమెకెందుకొచ్చిందని అంటున్నారు విఙ్జులు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అయిన అంశమైంది. ఇదే ప్రశ్న, ఆ మాటకొస్తే, ఏపీలో ఏ చిన్నపిల్లాడిని కదిపినా అడిగే, ఘాటైన సూటి ప్రశ్న.ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలని పురందేశ్వరి ఆలోచిస్తుండగా! ఆ పెద్దాయన మరిన్ని విషయాలు చెప్పారు.
“వేరొకరు అయితే అడిగేవాణ్ని కాదమ్మా! మాది గుడివాడ తాలుకా. మీ నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు జెండా మోశాను. ఆ అభిమానం తోనే అడుగుతున్నా!” అని ఆయన చెప్పుకొచ్చారు. పురందేశ్వరికి ఏం చెప్పాలో తెలియక, ‘రాష్ట్రాలను బట్టి పరిస్థితులు మారతాయి కాబట్టి సందర్భానికి న్యాయం చేసే పార్టీకే ఓటేయమని చెబుతున్నా. ఇదేమీ రాజకీయం కాదు’ అంటూ అక్కడ నుంచి చిన్నబుచ్చుకొని వెళ్లిపోయారట.
పెద్దాయన కష్టించి పనిచేసుకునే రైతే గానీ, రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ‘రాజకీయం కాకపోతే, మరెందుకు వచ్చావమ్మా?’ అని మరో ప్రశ్న వేయకుండా అక్కడితోనే ఆగిపోయారు. స్పష్టమైన జవాబు రాకున్నా, ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా సుస్పష్టం.
ఒకప్పుడు రాజకీయనాయకులు తాము చెప్పాలనుకున్నది చెప్పేవారు. జనం ఆకాశవాణి లో విన్నట్టు విని వెళ్లిపోయేవారు. కానీ, ఇప్పుడు ఓటర్లలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళలో విఙ్జత పెరిగింది, విశ్లేషణ పెరిగింది. ఆఅఙ్జానంతోనే వాళ్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి మార్పు సమాజానికి మంచిదేగా! సమాజంలో చాలా మంది కోరుకుంటున్న మార్పు దిశ దశ ఇదేగా! ఇకనైనా మన రాజకీయనేతలు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మసలుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? అయినా మన నాయకులు ముఖమ్మీద పేడ కళాపి చల్లినా తుడుచుకొని పోయేరకాలు. వాళ్ళకి సిగ్గెందుకు.
ఇప్పుడు పురందేశ్వరి రేపు ఉభయ తెలుగురాష్ట్రాల్లో అధికార పార్టీలోకి దూకేసిన ప్రతి ఒక్క నాయకునికి ప్రజలు సందించనున్న ప్రశ్నే ఇది. "పెత్తందార్లు" సినిమాలో నాగభూషణం, "రాజకీయనాయకుని భార్య పక్కింటోడితో లేచిపోయి ఎదురింట్లో కాపురంపెట్టి తెగ సంతోషపడుతున్నా భరించగలడట, కాని పదవి పోయి పదినిముషాలు కూడా బ్రతకలేడు" అని చెపుతాడు. అర్ధశతాబ్ధం క్రిందటి మాట ఇది. నేటికీ వర్తిస్తుంది.