సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో నేరుగా మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మొహమాటాలు వదిలేసి ఎక్కడ దొరికితే అక్కడ కడిగిపారేస్తున్నారు. అయితే చంద్రబాబు తమ స్నేహం విడిచాక బీజేపీ కూడా ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగానే ఉందని ముందుగానే అంచనాలు వచ్చాయి. చంద్రబాబుపై కేసులు పెడతారని ఎప్పటి నుంచో టాక్ ఉంది.
స్వయంగా చంద్రబాబే నాకేమైనా అయితే మీరే కాపాడుకోవాలని కార్యకర్తలకు కూడా చెప్పేశారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసుల వల పట్టిసీమతో మొదలవ్వబోతోందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ బీజేపీ నేతే. ఆయనే విష్ణుకుమార్ రెడ్డి.. పట్టిసీమ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని..దీనిపై 20రోజుల్లో సీబీఐ విచారణను కోరతామని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు చెప్పేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ధర్మపోరాటాల పేరుతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. చంద్రబాబు ఫియర్ సైకోసిస్ అనే వ్యాధితో సీఎం బాధపడుతూ అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సెటైర్లు మరీ పేల్చారు విష్ణుకుమార్ రాజు.
అంతే కాదు.. ఆయన కొన్ని ఫ్యూచర్ సంగతులు కూడా చెప్పేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి ఆదరణ తగ్గుతుందన్నారు. వైసీపీ బాగా పుంజుకుంటోందని విశ్లేషించారు.