తాజాగా కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోకుండా ఎక్కువగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో కోదండరాం రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కెసిఆర్ పాలన వల్ల విసిగి వేసరిపోయారని గట్టిగా నమ్ముతున్న ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆ ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో కోదండరాం నుంచి ఎవరు ఊహించని ప్రకటన వచ్చింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆగబోమని దానికి ముందే పంచాయతీ ఎన్నికల్లోనే కేసీఆర్ కి తమ సత్తా చూపిస్తామని కోదండరాం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజేఎస్) అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.
పోటీపై ఆసక్తి ఉన్నవారు తమ పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు అధినాయకుడు కేసీఆర్ కి తెలంగాణ జన సమితి పార్టీ గట్టిపోటీ ఇస్తుందని పేర్కొన్నారు కోదండరాం.