భారత దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారని పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు స్టేజీలు ఎక్కి ఉపన్యాసాలు దంచి కొడతారు. కానీ ఇదే భారత దేశంలో చిన్నపిల్లపై కూడా ఘోరంగా అత్యాచారాలు జరుగుతుంటే..చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని..ఏదో ఉపశమనం కోసం కేసులు పెడుతున్నారని సమాజంలో మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే రోజా అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 40 రోజుల వ్యవధిలో 45 అత్యాచార కేసులు నమోదయ్యాయని, ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. దాచేపల్లికి వచ్చి అత్యాచారానికి గురైన బాలికను పరామర్శిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రగాఢమైన అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎక్కడో లైటు ఆగిపోతే తనకు తెలుస్తుందని ప్రగల్భాలు పలుకుతున్న ఆయన, ఇంతమంది ఆడపిల్లల మానప్రాణాలు పోతుంటే దాన్ని కనిపెట్టే టెక్నాలజీ లేదా? అన్నారు. చంద్రబాబు నివసిస్తున్న గుంటూరు జిల్లాలో ఓ చిన్నారిపై అత్యాచారం జరిగి 48 గంటలు దాటినా నిందితుడిని అరెస్ట్ చేయలేదని, కనీసం ఇక్కడికి వచ్చి అమ్మాయి కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని నిప్పులు చెరిగారు.
కథువా దారుణమైన ఘటన మరువక ముందు మనరాష్ట్రంలో ఇంత దారుణం జరగడం సిగ్గచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అత్యాచారాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులను కఠినంగా శిక్షించివుంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.