రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీది వాపా ? బలుపా? అన్న అనుమానాలు జోరందుకుంటున్నాయ్. పార్టీలో జరుగుతున్న అనేక పరిణామాలు,ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, బిజెపికి రాష్ట్రంలో ఉన్న బలం నామమాత్రమే. ఏదో గాలి కొట్టినపుడు మాత్రమే రెండో,మూడో సీట్లు వస్తాయి. లేకపోతే అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా రావన్న విషయం అందరకీ తెలిసిందే. ఈ విషయం గడచిన ఎన్నికల చరిత్రను చూస్తే అర్ధమైపోతుంది. ఏదో ఓ పార్టీతో పొత్తులు పెట్టుకోవటం వల్ల ఒకరో, ఇద్దరో అభ్యర్ధులు గెలుస్తున్నారంతే. మొన్నటి వరకూ బిజెపి నేతలు కూడా తమ బలాన్ని పెద్దగా ఊహించుకున్న ఘటనలు కూడా చాలా తక్కువే. తమ బలమేంటో తమకు తెలుసుకాబట్టే వారు కూడా తమ హద్దుల్లోనే తాముండే వారు.
మారిన నేతల వైఖరి :
2014లో నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రంలో బిజెపి నేతల వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న టిడిపి-బిజెపిలు ఒకదాని వల్ల మరొకటి లాభపడిందన్నది వాస్తవం. వీళ్ళ లాభానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఊతమిచ్చారు. అయితే, ఎప్పుడైతే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి బిజెపి నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. తమ వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందన్న వితండ వాదాన్ని బయటకు తెచ్చారు.
ప్రతీచిన్నదానికీ గిల్లి కజ్జాలే :
ప్రతీ చిన్న విషయానికి టిడిపి నేతలతో గిల్లికజ్జాలు పెట్టుకోవటం మొదలుపెట్టారు. దానికితోడు చంద్రబాబునాయుడు కూడా బిజెపి నేతలను ఏ దశలోనూ లెక్క చేయలేదు. దాంతో రెండు పార్టీల మధ్య అగాధం మొదలై చివరకు పొత్తులు విడిపోయే వరకూ వచ్చింది. బిజెపి నేతలు సోము వీర్రాజు మిగిలిన అందరి నేతలకన్నా నాలుగాకులు ఎక్కువ చదివారన్నట్లుగా వ్యవహిరంచారు. చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. తన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయటంతో టిడిపి నేతలకు కూడా చిర్రెత్తుకొచ్చింది.
ఒంటరి పోటీకే నేతల మొగ్గు :
సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే, వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలన్నది బిజెపి నేతల అభిమతం. ఒంటిరిగా పోటీ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా అంతటి శక్తి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి పట్టులేదన్నది వాస్తవం. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరుకుతారా అన్నదే ప్రధాన సమస్య.
నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులు దొరుకుతారా ?
పోటీ అంటే బిఫారం ఇచ్చి ఎవరో ఒకరిని పోటీలోకి దింపటం కాదు కదా? నియోజకవర్గం మొత్తంలో తెలిసిన నాయకుడు, గెలుస్తాడు అనిపించుకునే స్దాయి నేతలు బిజెపిలో ఎంతమందున్నారో కూడా సరిగ్గా తెలీదు. ఎక్కడో ఉత్తరాదిలో పార్టీలో గెలుస్తోంది కాబట్టి రాష్ట్రంలో కూడా తమ బలం పెరిగిపోయిందని భ్రమపడుతున్నారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడబోతే బిజెపి నేతలు వాపును చూసి బలుపనుకుంటున్నారేమో అనిపిస్తోంది. సరే, వాపో లేకపోతే బలుపో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది కదా?