ఆబోతుల్లా రోడ్లమీదకొస్తే వారికదే ఆఖరి రోజు..జీవితంమీద ఆశలు వదులుకుంటేనే ఆడపిల్లల జోలికి వెళ్ళాలి.. ఇవి తాజాగా చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు. ఆడవాళ్ళపైన, ఆడపిల్లలపైన అత్యాచారాలు చేయాలని అనుకుంటున్న వారిని సిఎం చేసిన తీవ్రంగా హెచ్చరించారు. ఏంటి హెచ్చరికలన్నీ నిజమే అనుకుంటున్నారా ? చంద్రబాబు హెచ్చరికలు మృగాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, గడచిన నాలుగేళ్ళల్లో చంద్రబాబు ఇటువంటి హెచ్చరికలు చాలానే చేశారు. అయితే, ఎవరూ కనీసం లెక్క కూడా చేయలేదు. పైగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా గడచిన నాలుగేళ్ళుగా ఆడవాళ్ళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విచిత్రమేమిటంటే సంవత్సరం సంవత్సరానికి ఆఘాయిత్యాలు పెరిగిపోతుండటం. అత్యాచారాలు, మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్న విషయం పోలీసు రికార్డులే చెబుతున్నాయి.
శాంతిభద్రతలకు ఏమైంది ?
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారిపోయింది. అందుకు ప్రధానకారణం చంద్రబాబే అని చెప్పాలి. ఎలాగంటే, ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వారు, మహిళలపై దాడులు చేస్తున్నవారు, అత్యాచారాలు చేస్తున్న వారిలో అత్యధికులు టిడిపికి చెందిన వారే ఉంటున్నారు. అయితే టిడిపి నేతలు లేకపోతే వారి మద్దతుదారులుగా ఉంటున్నారు. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం హడావుడి చేస్తోందే కానీ ఏ ఘటనలోనూ ఇంత వరకూ నిందితులకు శిక్షలు పడలేదు. ఎందుకంటే, ఘటన జరగ్గానే నిందుతులకు మద్దతుగా టిడిపి నేతలు రంగంలోకి దిగుతున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో దర్యాప్తులో పోలీసుల చేతులు కట్టేసినట్లవుతోంది.
పోలీసులేం చేస్తున్నట్లు ?
నేరాలు జరగకుండా చూడటమే పోలీసుల ప్రాధమిక కర్తవ్యం. కానీ అన్నీ సార్లు అది సాధ్యం కాదు. కాబట్టి నేరం జరిగిన వెంటనే నిందితులను పట్టుకోవటం, సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడేట్లు చేయాలి. కానీ అలా జరుగుతోందా అన్నదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే, బాధితులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావటం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ కేసులు నమోదైనా దర్యాప్తు సక్రమంగ జరగటం లేదని పోలీసులే రెండు వర్గాల తరపున రంగంలోకి దిగి మద్యస్తాలు చేస్తున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసేమైంది ?
ఒకపుడు రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసుఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆ కేసులో మంత్రులు, ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు పలువురు టిడిపి నేతలకు సంబంధాలున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఏదో తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారే కానీ దర్యాప్తులో నిజాయితీ లేదని వైసిపి ఎన్నోమార్లు ఆరోపించింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇదే కాకుండా రాష్ట్రంలో జరిగిన ఎన్నో కేసులను వైసిపి ఆరోపణల ప్రకారం కేసులను పోలీసులే నీరు గార్చేస్తున్నారు. నాలుగేళ్ళలో కొన్ని వందల కేసులు ఈ విధంగానే మూలపడిపోయాయట. దాని ఫలితమే నిందితులకు ఎక్కడ లేని ధైర్యం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇపుడేదో చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేస్తే ఫలితముంటుందా ?