ఇక మాటలు లేవ్..మాట్లాడుకోవడాలు లేవు..ఇప్పటి వరకు టీడీపీలో జరిగిన అవమానాలు చాలు..ఇక భరించడం నావల్ల కాదు అంటూ విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత కన్నబాబురాజు శనివారం వైసిపిలో చేరారు. కన్నబాబు గడచిన ఐదేళ్ళుగా టిడిపిలో సేవలందిస్తున్నారు. చంద్రబాబునాయుడుపై అసంతృప్తితోనే రాజు వైసిపిలో చేరారు.
ఆయనతో పాటు కొడుకు, విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ సుకుమార్ వర్మ కూడా వైసిపి కండువా కప్పుకున్నారు. కన్నబాబుతో పాటు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో పాటు వందలాదిమంది టిడిపి కార్యకర్తలు కూడా వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. కృష్ణజిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు.
ఎప్పుడైతే కన్నబాబు టిడిపికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుండి చంద్రబాబు బుజ్జగింపులు మొదలుపెట్టారు. అయితే అవేవీ పనిచేయలేదు. పోయిన ఎన్నికల సమయంలో టిడిపిలో చేరేముందు రాజుకు చంద్రబాబు అనేక హామీలిచ్చారు. అయితే, ఒకసారి కన్నబాబు టిడిపిలో చేరిన తర్వాత తానిచ్చిన హామీలను చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో ఇంతకాలం అసంతృప్తితో ఉన్న కన్నబాబు చివరకు ఈరోజు వైసిపిలో చేరారు.