కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కుటుంబాలకు కుటుంబాలు బరిలోకి దిగుతున్నాయి. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీకానీ, పంజాబ్ ఎన్నికల సందర్భంగా కుటుంబానికి ఒక్క టికెట్టేనని ప్రకటించిన కాంగ్రెస్కానీ ఆ కట్టుబాట్లకు చెరమగీతం పాడాయి. ఇక జేడీఎస్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదనీ తేలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతల కుటంబాలకు సభ్యులకు, వారి అనుయాయులకు సీట్లు కేటాయించి వారసత్వ రాజకీయాలను పెంచిపోషిస్తున్నాయి. 224సీట్లు ఉన్న కర్ణాటక ఎన్నికల్లో చాలా వరకు స్థానాల్లో వారసులే బరిలో నిలిచారు. ఇక ఏళ్లకు ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు, రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన వారిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటికే పార్టీల్లో ఉన్న కీలక నేతలు వారితోపాటు వారి కుటుంబాల సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నారు. నేతల వారసులు ఒక్కరోజైనా జెండా మోయకుండా టికెట్లు పొంది హాయిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులందరూ మళ్లీ వారసుల చుట్టూ తిరగాలి. వారి చెప్పుచేతుల్లోనే మెదులుతూ జెండాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మళ్లీ ఎన్నికల వచ్చినప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతుంది.
ఒకవేళ ఆ వారసులే రాజకీయాల్లో నిలదొక్కుకుంటే ఇక ఏళ్లకు ఏళ్లు మళ్లీ వేరే వారికి అవకాశమే ఉండదు. ఈ నేపథ్యంలో వారితో పోటీపడి టికెట్లు సాధించుకోలేకపోతున్నారు సాధారణ నాయకులు. కర్ణాటకలో ఈనెల 12న జరిగే పోలింగ్లో 40 నుంచి 50మంది వారసలు బరిలో నిలిచారు. అయితే కొందరు ఒకే పార్టీ నుంచి బరిలో ఉండగా.. మరికొందరు సీట్లు రాలేదని ఇతర పార్టీల్లోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర ఈసారి వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సిద్దు మాత్రం ఏకంగా చాముండేశ్వరితోపాటు బాదామి నుంచి బరిలో నిలిచారు.
హోం మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి జయనగర నుంచి బరిలో నిలిచారు. న్యాయశాఖ మంత్రి జయచంద్ర కుమారుడు సంతోష్ జయచంద్ర కూడా బరిలో ఉన్నారు. లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే మళ్లీ బరిలో నిలిచారు. ఇక బీజేపీలోని నేతల వారసులు కూడా బరిలో నిలిచారు. ముందుగా యెడ్డీ ఇద్దరు కుమారులకు కూడా టికెట్లు ఇవ్వాలని చూసినా ఆర్ఎస్ఎస్ హెచ్చరికలతో వెనక్కితగ్గారు. అయితే ఇతర నేతల కుటుంబ సభ్యులకు, బంధువులకు టికెట్లు ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు సోదరులకు టికెట్లు ఇచ్చారు. ఇక జేడీఎస్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. దేవేగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రెండుచోట్ల నుంచి బరిలో ఉన్నారు.