వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బిసి-కాపు సామాజికవర్గాల మధ్య ఇరుక్కుపోయే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ పెట్టినప్పటి నుండి టిడిపికి మద్దతుగా నిలుస్తున్న బిసి సామాజికవర్గం కూడా రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ ఇస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా కాపుల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటే బిసిల్లో అత్యధికులు టిడిపికి వెన్నుదన్నుగా నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే గడచిన నాలుగేళ్ళుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో బిసి సామాజికవర్గంలోని మెజారిటీ సెక్షన్ కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చే సూచనలే కనబడుతున్నాయి. బిసిలతో పాటు కాపులను కూడా ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న చంద్రబాబు వ్యూహం పూర్తిగా బెడిసికొట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది.
బిసిలు కాపులకు రాజకీయంగా చుక్కెదురు
పోయిన ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఏకైక్ష లక్ష్యంతో చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలిచ్చేశారు. అటువంటి వాటిల్లో కాపులను బిసిల్లో చేరుస్తాననేది చాలా కీలకమైనది. రాష్ట్రంలో దశాబ్దాలుగా కాపులకు బిసిలకు రాజకీయంగా ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఒక సామాజికవర్గం ఓ పార్టీవైపుంటే ఇంకో సామాజికవర్గం మరోపార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలుసుకాబట్టే కాపులను బిసిల్లో చేరుస్తానంటూ హామీ ఇచ్చారు. నిజానికి కాపులను బిసిల్లో చేర్చటమన్నది చంద్రబాబు చేతిలో పనికాదు. రిజర్వేషన్ల క్యాటగిరి నుండి ఒక కులాన్ని తీసేయాలన్నా, మరో కులాన్ని చేర్చాలన్నా కేంద్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి.
బెడిసికొట్టనున్న వ్యూహం ?
కాపులను బిసిల్లో చేరుస్తూ చంద్రబాబు తీసుకున్న వ్యూహం చివరకు బెడిసికొడుతుందేమోన్న ఆందోళన టిడిపిలో స్పష్టంగా కనబడుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాపులను బిసిల్లో చేరుస్తూ చంద్రబాబు మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకున్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని చంద్రబాబు ఢిల్లీకి పంపగానే కేంద్ర సదరు బిల్లును పెండింగ్ లో పెట్టేసింది. దాంతో చంద్రబాబు వ్యూహం వచ్చే ఎన్నికల్లో బెడిసికొడుతుందే అన్న ఆందోళన టిడిపిలో కనబడుతోంది.
కాపులకన్నా బిసిలే ఎక్కువ
జనాభాను తీసుకున్నా, ఓటర్లను తీసుకున్నా బిసి సామాజికవర్గమే అత్యధికంగా ఉంది. అయితే, బిసిల్లో మళ్ళీ దాదాపు 130 ఉపకులాలుండటం, కాపుల్లో ఉన్న ఐకమత్యం బిసిల్లో కనబడకపోవటంతోనే అధికారానికి బిసిలు ఆమడదూరంగా ఉంటున్నారు. అలాగని కాపుల జనాభా కూడా తక్కువేమీ కాదు. రాష్ట్ర జనాభాలో కాపులు సుమారుగా 23 శాతమున్నారు. ఎప్పుడైతే అసెంబ్లీలో కాపులకు అనుకూలంగా బిల్లు పాసైందో అప్పటి నుండి బిసిలు చంద్రబాబుపై మండిపడుతున్నారు.
రెంటికి చెడ్డ రేవడి ?
చంద్రబాబు పరిస్దితి చివరకు రెంటికి చెడ్డ రేవడిగా అయిపోతుందేమో అని పలువురు విశ్లేషిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుత పరిస్ధితి ప్రకారం చంద్రబాబు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర అనుమతి సాధ్యం కాదన్న విషయం తెలిసిందే. దాంతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ కాపులు మండిపోతున్నారు. అదే సమయంలో బిసిలు కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిస్దితుల్లో అటు కాపులు, ఇటు బిసిలకు చంద్రబాబు దూరమై రెంటికి చెడ్డ రేవడి అయిపోతారన్న ఆందోళన టిడిపిలో స్పష్టంగా కనబడుతోంది.