చంద్రబాబునాయుడు మెడకు ఓటుకునోటు కేసు బిగుసుకుంటోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం మొదలైంది. దాదాపు రెండేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓటుకునోటు ఘటనపై సోమవారం తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంఎల్ఏల ఓట్లను కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణా ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటుకు చంద్రబాబు రూ. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఒప్పందంలో భాగంగా స్టీఫెన్ కు ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి అడ్వాన్సుగా రూ 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
అప్పట్లో పెద్ద సంచలనం
ఓటుకునోటు ఘటనలో ఓ ఎంఎల్ఏ సాక్ష్యాధారాలతో పట్టుబడటం అప్పట్లో దేశంలో పెద్ద సంచలనం కలిగించింది. అంతేకాకుండా స్టీఫెన్ తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో కూడా లీకవ్వటం ఇంకా సంచలనం కలిగించింది. సరే, తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. ఆ దెబ్బకే పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ఏడాలోనే చంద్రబాబు వదిలేసి అమరావతికి మారిపోయారని ఇప్పటికీ ఏపిలోని ప్రతిపక్షాలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ ఉంటాయి.
సుప్రింకోర్టులో వైసిపి ఎంఎల్ఏ కేసు
తర్వాత అదే కేసుపై వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రింకోర్టును కూడా ఆశ్రయించారు. అంతకుముందే ఏసిబి కోర్టులో చంద్రబాబు విచారణకు పిటీషన్ దాఖలు చేస్తే తనపై ఎటువంటి విచారణ జరగకుండా చంద్రబాబు స్టే కూడా తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఓటుకునోటు కేసులో ఎటువంటి పురోగతి కనబడలేదు.
కెసిఆర్ సమీక్షతో చంద్రబాబుకు ఇబ్బందులేనా ?
ఇంతకాలానికి కెసిఆర్ హటాత్తుగా కేసులో సంబంధం ఉన్న అందరు ఉన్నతాధికారులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఓటుకునోటుపై ఏఏ కోర్టులో కేసులున్నాయి, చంద్రబాబు ఫోన్ సంభాషణలపై ఫోరెన్సిక్ నిపుణులు అందచేసిన నివేదిక తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు. అప్పట్లో ఏసిబి డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఏకె ఖాన్ ను కూడా ప్రత్యేకంగా సమావేశానికి పిలిపించటం గమనార్హం. మొత్తం మీద ఇంతకాలానికి అదీ ఎన్నికలకు ముందు ఓటుకునోటు కేసుపై కెసిఆర్ సమీక్షించటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.