ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబునాయుడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయ్. ఇపుడున్న సమస్యలకు తోడు తాజాగా ఓటుకునోటు కేసులో ఒక్కసారిగా కదలిక రావటం నిజంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేదనటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు మూడేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న ఓటుకునోటు కేసులో ఒక్కసారిగా ఎందుకు కదలిక వచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
అందులో భాగంగానే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. తాను నిప్పునని తనపై ఒక్క కేసు కూడా లేదని ఎంత గంభీరంగా చెప్పకుంటున్నా వాస్తవమేంటో చంద్రబాబుకూ తెలుసు. అందులోనూ మిగిలిన కేసులు, కోర్టులో వాటిపై ఉన్న స్టేల విషయాలను పక్కనపెట్టినా మూడేళ్ళక్రితం వెలుగు చూసిన ఓటుకునోటు కేసులో తెరవెనుకున్న సూత్రదారులెవరు ? ముందున్న పాత్రదారులెవరు? అన్న విషయాల గురించి అందరికీ తెలిసిందే.
ఎటుచూసినా సమస్యలే
ప్రస్తుతం రాష్ట్రంలో ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయ్. సమస్యలను అదుపుచేయలేకే చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. పోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళల రుణమాఫి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం,ప్రపంచస్ధాయిలో అద్భుతమైన రాజధాని నిర్మాణం, కాపులను బిసిలోకి చేర్చటం, బోయలను ఎస్టీలో చేర్చటం లాంటి అనేక హామీలు అమలవుతున్న విధానం అందరికీ తెలిసిందే.
నిరుద్యోగభృతి హామీ అమలేకాలేదు. కాపులు, ఎస్టీలకిచ్చిన హామీలు అటకెక్కేశాయి. రాజధాని నిర్మాణం ఇంకా ప్లాన్లు తయారయ్యే దశలేనే దాటలేదు. చెప్పుకుంటూపోతే సమస్యలు చాలానే ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు.
శాంతి భద్రతలే అసలైన సమస్య :
మిగిలిన వాటి సంగతి ఎలాగున్నా ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు అదుపులో ఉంటే పరిపాలన బాగుందనే అంటారు. కానీ ఏపిలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లు తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా శాంతి, భద్రతలు క్షీణించాయనే చెప్పాలి. ఇదెవరో ప్రతిపక్ష నేత చెబుతున్న మాట కాదు. స్వయంగా పోలీసు రికార్డులే చెబుతున్న సత్యాలు. శాంతి భద్రతలు ఈ స్ధాయిలో క్షీణించటానికి ప్రధాన కారణం చంద్రబాబు అసమర్ధత అనే చెప్పాలి. ఎందుకంటే, లా అండ్ ఆర్డర్ క్షీణించటంలో ప్రధాన పాత్ర టిడిపి నేతలు, వారి మద్దతుదారులే. అందుకనే ఎవరినీ అదుపుచేయలేక మొత్తాన్ని గాలికొదిలేశారు. మహిళలపై అఘాయిత్యాలు, దాడుల వంటి కేసుల్లో మంత్రులు, ఎంఎల్ఏలే ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే పరిపాలన ఎంత సవ్యంగా ఉందో అర్ధమవుతోంది.
సూత్రదారులు, పాత్రదారులు టిడిపి నేతలే :
రాష్ట్రంలో జరిగే నేరాలకు మూలాలు ఎక్కువ భాగం టిడిపి నేతల వద్దే తేలుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు నేతలు ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉంటున్నారని వైసిపి నేతలు ఎప్పటి నుండో మండిపడుతున్నారు. అందుకనే ఎవరిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయ్. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి, ఇంకోవైపు ఇచ్చిన హామీలేవి అమలు కాలేదు, మరోవైపు కేంద్రంతో సంబంధాలు పూర్తిగా చెడిపోయింది. ఇటువంటి పరిస్దితుల్లో మూలనపడిపోయిందనుకున్న ఓటుకునోటు కేసు మళ్ళీ యాక్టివ్ అయితే చంద్రబాబు సమస్యల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే.