కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సామదానబేధదండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు ప్రధాని మోదీ!! గుజరాత్ ఎన్నికల్లో ఫాలో అయిన స్ట్రాటజీనే కర్ణాటకలోనూ అచ్చుగుద్దినట్టు ఇక్కడా ఫాలో అయిపోతున్నారు. నాలుగేళ్లలో ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో, ఎటువంటి హామీలుఇచ్చి అధికారంలోకి వచ్చిందో, గద్దెనెక్కిన తర్వాత ఏ స్థాయిలో మార్పులు తెచ్చిందో వంటి విషయాలను ప్రస్తావించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక ప్రజల్లో ఉన్న వైషమ్యాలు కలిగేలా, కులాల మధ్య చిచ్చు రగిల్చేలా, అంతర్గత కలహాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా చేసుకుని ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రసంగాల సరళి గమనించిన విశ్లేషకులు, ఇతర పార్టీ నేతలు కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధాని హోదాలో హుందాగా వ్యవహరిస్తూ ప్రచారంలో పాల్గొనాల్సిన ఆయన.. ఆ హోదా దిగజార్చేలా కర్ణాటక ఎన్నికల్లో మాట్లాడుతున్నారనే చర్చ మొదలైంది.
రాజకీయంగా విపక్షాలపై విమర్శలు, ఆరోపణలు,గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై నిలదీయడం వంటి సహజమే అయినా.. ప్రధాని మోడీ ఇప్పుడు ఆ స్థాయి దాటి పోయారనే చర్చ మొదలైంది. అధికారంలోకి రాకముందు ఎలాంటి విమర్శలు చేశారో.. అధికారంలోకి వచ్చాక, అందులోనూ ప్రధాని పదవిలోకి వెళ్లిన తర్వాత కూడా ఆయనలో ఇసుమంతైనా ఎటువంటి మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది బీజేపీ పరిస్థితి. సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక పరువు పోతుందనుకున్నారో ఏమోగానీ.. అకస్మాత్తుగా పాకిస్థాన్ను తెరపైకి తీసుకొచ్చారు. తాను గెలవకుండా కాంగ్రెస్, పాకిస్థాన్తో కుమ్మక్కు అయిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రధాని స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదంటూ అంతా హితవుపలికారు. అప్పటినుంచి మోడీ.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి.
అత్యంత నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆయన ఎజెండా ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రచారంలో అప్పుడప్పుడూ భావోద్వేగానికి గురువుతున్నట్లు కనిపిస్తున్నారు. నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి అట్టడుగుస్థాయి ప్రచార ఎత్తుగడలని రాజకీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు 56 అంగుళాల చాతితో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తానో చెప్పే మోడీ.. ఇప్పుడు తనపై సానుభూతి, జాలి కలగాలన్నట్లుగా ప్రచారసభల్లో మాట్లాడుతున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు. పేద తల్లి బిడ్డనని, బలహీనవర్గానికి చెందిన వ్యక్తినని, తాను పైకి రావడం కాంగ్రెస్కు ఇష్టం లేదన్నట్లు చెప్పుకొస్తున్నారు. వేగంగా ఆరిపోతున్న బీజేపీ దీపాన్ని బావోద్వేగాలు రెచ్చగొట్టి అయినా మళ్లీ ఎలా వెలిగించాలన్న తాపత్రయమే ఇప్పుడు మోడీలో కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల ఆధారంగానే దేశ రాజకీయాల్లో మార్పులుంటాయనేది ఇప్పుడు తేలిపోయింది. అందుకే ప్రధాని మోడీ మరింతగా… విద్వేష, వైషమ్య రాజకీయాలు చేస్తున్నారనే విశ్లేషణలు అధికమయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీ అత్యంత కఠినమైన సవాల్ ఎదుర్కొంది. దీనికి అప్పుడు కూడా మోడీ ఇదే తరహా ప్రచారం చేసి విమర్శలు అందుకున్నారు. కాంగ్రెస్కు ముస్లింలను మాత్రమే గౌరవిస్తుందని.. హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు! దళితులను కాంగ్రెస్ అవమానించిందని.. దశాబ్దాల కిందటి ఘటనలు ఉదహరిస్తున్నారు. ఇలాంటివన్నీ చేసి ప్రధాని పదవికి కళంకం తీసుకొస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అయినా కర్ణాటకలోనూ మోడీ అదే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన స్థాయిని దిగజార్చిందని వివరిస్తున్నారు.