కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని పదవిపై తొలిసారి స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని, మోదీ మళ్లీ ప్రధాని కావడం కూడా అంతే అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని పదవిని చేపడతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘అవును’ అని రాహుల్ సమాధానం ఇచ్చారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని(యడ్యూరప్ప) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారని బీజేపీని మరోసారి ప్రశ్నించారు. 35 వేల కోట్ల రూపాయలు దోచుకున్న గాలి జనార్దన్రెడ్డి వర్గానికి 8 సీట్లు ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అన్నారు. ‘మొబైల్ ఫోన్లలో మూడు మోడ్స్ ఉంటాయి. వర్క్మోడ్.. స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్. మోడీజీ స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్నే వాడతారు.వర్క్మోడ్ జోలికి అస్సలు వెళ్లరు'అని రాహుల్ ఎద్దేవా చేశారు.
ప్రధాని పదవిపై రాహుల్ మనసులో మాట బయటపెట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి పదవిని చేపట్టే విషయంలో యువనేత స్పష్టత ఇవ్వడంతో హస్తం పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు తటపటాయించేవారు. రాహుల్ తాజా ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త శక్తి వచ్చినట్టైంది.