ఓటుకునోటు కేసు సెగ చంద్రబాబునాయుడును బాగా తాకినట్లే కనబడుతోంది. సోమవారం కేసుపై తెలంగాణా సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా సమీక్ష చేసిన విషయం తెలిసిందే. మంగళవారం అమరావతిలోని తన కార్యాలయంలో చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో ఓటుకునోటు కేసు పూర్వపరాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు.
సోమవారం కెసిఆర్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిఉన్నా లెక్క చేయకుండా చట్ట ప్రకారం విచారణ వేగవంతం చేయాలంటూ ఆదేశించారు. దాదాపు మూడేళ్ళుగా మూలనపడిఉన్న ఈ కేసును ఇంత హటాత్తుగా కెసిఆర్ ఎందుకు సమీక్షించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ కేసుకు కెసిఆర్ దుమ్ము దులపటంతో చంద్రబాబుతో పాటు టిడిపి నేతల్లో కూడా ఆందోళన స్పష్టంగా బయటపడుతోంది.
చంద్రబాబుకు ఇబ్బందేనా ?
అసలే అనేక సమస్యలతో అవస్తలు పడుతున్న సమయంలో హటాత్తుగా ఓటుకునోటు కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కెసిఆర్ నిర్ణయించటం చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేదనటంలో సందేహమే లేదు. గతంలో చంద్రబాబు మీదున్న కేసులేవి, స్టేలపై కొనసాగుతున్న కేసులేవి అన్న విషయాలు ఇపుడు దాదాపు ఎవరికీ గుర్తు లేదు. కాకపోతే మూడేళ్ళ క్రితం వెలుగు చూసిన ఓటుకునోటు కేసు గురించి మాత్రం తెలుగు ప్రజలకే కాదు యావత్ దేశానికంతటికి తెలుసు.
కెసిఆర్ నుండి ఊహించని కోణం
కేంద్రమంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేయటం తర్వాత ఎన్డీఏలో నుండి తప్పుకున్న తర్వాత చంద్రబాబులో కేసుల భయం మొదలైంది. అనేకసార్లు చంద్రబాబు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. తనతో పాటు తన కొడుకు నారా లోకేష్, సీనియర్ నేతలపై కేంద్రం కేసులు పెట్టే అవకాశాలున్నట్లు చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా బహిరంగంగా కూడా అనేక సార్లు ప్రస్తావించారు.
కేసులకు సంబంధించి చంద్రబాబు దృష్టంతా కేంద్రం మీదుండగా ఊహించని రీతిలో మూలనపడున్న ఓటుకునోటు కేసును కెసిఆర్ బయటకు తీయటంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. దాని పర్యవసానమే మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.