తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకుంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి అంటున్న విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ మారోసారి మంచి వార్తతో ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని ఇవ్వనున్నారు. ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కేసీఆర్ కొన్ని ప్రకటనలు విడుదల చేయనున్నారు. అదే రోజున వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
సమావేశంలో పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన 18 డిమాండ్లు, ఉపాధ్యాయ సంఘాలు తెరపైకి తీసుకొచ్చిన 36 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, నివేదిక గడువు, వేతన సవరణను అమలు కాలవ్యవధి తదితర అంశాలపైనా చర్చించనున్నారు.